10 నిమిషాల సమయం కోరి సుప్రీంకోర్టునే మెప్పించాడు.. ఎవరీ 19 ఏళ్ల యువకుడు?

by Prasad Jukanti |   (  Updated:2026-02-14 11:37:18  IST  )

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన 19 ఏళ్ల విద్యార్థి అథర్వ చతుర్వేది, ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయకపోవడంతో తనకు జరిగిన అన్యాయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. స్వయంగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 2025-26 విద్యాసంవత్సరానికి అతడికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది .

10 నిమిషాల సమయం కోరి సుప్రీంకోర్టునే మెప్పించాడు.. ఎవరీ  19 ఏళ్ల యువకుడు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉన్నత చదువుల కోసం ప్రవేశ పరీక్షలో తనకు జరిగిన అన్యాయంపై ఓ 19 ఏళ్ల విద్యార్థి సుప్రీంకోర్టులో (Supreme Court) కేసు గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. విచారణ సమయంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను పది నిమిషాల సమయం ఇవ్వాలని కోరి సొంతంగా వాదనలు వినిపించుకొని విజయం సాధించాడు. ఆ యువకుడి వాదనలతో కన్విన్స్ అయిన న్యాయస్థానం నిమిషాల వ్యవధిలో అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్‍లోని జబల్‍పూ‌ర్‍కు చెందిన లాయర్ మనోజ్ చతుర్వేది కుమారుడు అథర్వ చతుర్వేదికి (Atharva Chaturvedi) డాక్టర్ కావాలని కోరిక. మెడిసిన్ చేసేందుకు అతను రెండు సార్లు ‘నీట్’ రాసి పాస్ అయ్యాడు. 530 స్కోర్ చేసిన తనకు ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో సీటు తప్పకుండా వస్తుందని ఆశించాడు. అయితే చివరి రౌండ్ కౌన్సెలింగ్ వరకు ఎదురు చూసినా అవకాశం రాలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచించిన అథర్వ చతుర్వేదికి తమ రాష్ట్రంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను (EWS Quota) అమలు చేయడం లేదని గ్రహించాడు. మరో వైపు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు సీట్లు అందుబాటులో ఉన్నాయని గుర్తించాడు. తనతో పాటు తనలాంటి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఈతరహా అన్యాయం జరుగుతున్నదని భావించిన చతుర్వేది న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు.

అడ్మిషన్ తిరస్కరించొద్దన్న కోర్టు

ఈ వ్యవహారంపై చతుర్వేది ఈ ఏడాది జనవరి 6న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశాడు. దీనిని తానే సొంతంగా తయారు చేశాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం విధానపరమైన లోపాలు సదరు యువకుడి చదువుకు ఆటంకంగా ఉండటాన్ని గుర్తించింది. ప్రైవేట్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేయనందున అతని అడ్మిషన్‌ను తిరస్కరించొద్దని పేర్కొన్న న్యాయస్థానం 2025-26 విద్యా సంవత్సరంలో అతడికి అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Next Story