చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి

by Dishanational1 |
చత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చత్తీస్‌గఢ్‌లో మరోసారి మావోయిస్టులు, పోలీసులు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలోని దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జిల్లాలోని కొర్చెలి అటవీ ప్రాంతంలో ఉన్న లేంద్ర గ్రామ సమీపంలో చేపట్టిన ఆపరేషన్‌లో కాల్పులు జరిగాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) సుందర్‌రాజ్ పి తెలిపారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారంతో డీఆర్‌జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా కమాండ్ యూనిట్ బలగాలు ఆపరేషన్‌లో పాల్గొన్నాయని ఆయన పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటు లైట్ మెషిన్ గన్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని సుందర్‌రాజ్ వెల్లడించారు. సాధారణంగా ప్రతి ఏటా మార్చి-జూన్ మధ్య మావోయిస్టులు ఈ ప్రాంతంలో శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులు జరుగుతాయని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాడులు పెరిగే అవకాశం ఉన్న కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఆపరేషన్ చేపట్టినట్టు వెల్లడించారు. గత నెల 27న సైతం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తాజా ఘటనతో, బీజాపూర్‌ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 41 మంది మావోయిస్టులు మరణించారు.

Next Story

Most Viewed