బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తొలగింపు.. వారి వివరాలివ్వాలని సుప్రీం ఆదేశం

by Yella Dhawani Reddy |

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) చేపట్టిన సంగతి తెలిసిందే.

బిహార్‌లో 65 లక్షల మంది ఓటర్లు తొలగింపు.. వారి వివరాలివ్వాలని సుప్రీం ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లో (Bihar) ఎన్నికల సంఘం (Election Commission) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా ఈనెల 1న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ (EC) విడుదల చేసింది. అయితే, రాష్ట్రంలో మొత్తం 65 లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్టు ఈసీ ప్రకటించింది. ఇంతా పెద్ద మొత్తంలో ఓటర్ల తొలగింపు గతంలో ఎన్నడూ జరగకపోవడంతో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. దీంతో ఈ జాబితాను ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ADR) సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, తొలగించిన వారిలో ఎవరు చనిపోయారు? ఎవరు వలస వెళ్లారు? లేక మరేదైనా కారణం ఉందా? అన్న విషయాల్లో స్పష్టత లేదని పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా, తొలగించిన ఓటర్ల వివరాలను బహిరంగంగా ప్రకటించేలా కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరింది.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం (ఆగస్టు 6) విచారణ చేపట్టి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9 లోపు తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలను తమకు సమర్పించాలని ఈసీని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేసింది. కాగా, ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, తొలగించబడిన ఓటర్లలో సుమారు 22 లక్షల మంది మరణించినవారుగా, 7 లక్షల మంది డుప్లికేట్ ఓటర్లుగా గుర్తించింది. మిగిలిన 36 లక్షల మంది ఓటర్ల వివరాలు అస్పష్టంగా ఉండటం వల్ల తొలగించాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. అయితే, ఈ మొత్తం ప్రక్రియ సరైన డాక్యుమెంటేషన్ లేకుండానే జరిగిందన్న ఆరోపణలతో ఏడీఆర్ సుప్రీంను ఆశ్రయించింది.

Next Story