Kashmir Tourism: పెహల్‌గామ్ దాడితో 60 శాతం క్షీణించిన కశ్మీర్ పర్యాటకం

by S Gopi |

ప్రయాణాలను ఖరారు చేసుకున్న 10 మందిలో ఆరుగురు తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నట్టు లోకల్‌సర్కిల్స్ స్పష్టం చేసింది.

Kashmir Tourism: పెహల్‌గామ్ దాడితో 60 శాతం క్షీణించిన కశ్మీర్ పర్యాటకం
X

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్‌గామ్ ఉగ్రవాద దాడి కారణంగా కశ్మీర్‌లో పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైంది. చాలామంది ఆపరేటర్లు పెద్ద ఎత్తున పర్యటనకు చేసుకున్న బుకింగ్‌లను రద్దు చేశారు. ఈ ఏడాది మే-డిసెంబర్ మధ్య కశ్మీర్ పర్యటన కోసం ప్రయాణాలను ఖరారు చేసుకున్న 10 మందిలో ఆరుగురు తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నట్టు లోకల్‌సర్కిల్స్ తన్ సర్వేలో స్పష్టం చేసింది. దేశీయ విమానయాన సంస్థల ప్రకారం, దారుణ ఘటన నేపథ్యంలో ఇప్పటికే శ్రీనగర్‌కు వెళ్లే దాదాపు 15,000 విమాన టికెట్లను రద్దు చేయాలని లేదా రీషెడ్యూల్ చేయాలనే అభ్యర్థనలు వచ్చాయి. ఈ పరిణామాలతో పర్యాటకం రానున్న రోజుల్లో మరింత దెబ్బతింటుందని, ముఖ్యంగా జూన్‌లో జరిగే అమర్నాథ్ యాత్రపై తీవ్ర ప్రభావం చూపవచ్చని పర్యాటక రంగం వర్గాలు చెబుతున్నాయి.

భారీగా ప్రయాణాలు రద్దు చేసిన ప్రయాణికులు

దేశవ్యాప్తంగా 361 జిల్లాల నుంచి సేకరించిన లోకల్‌సర్కిల్స్ సర్వే ప్రకార, పెహల్‌గామ్ దాడి ప్రజల్లో చాలా ఆందోళనలను కలిగించాయి. కశ్మీర్‌కు వెళ్లాలని ఇప్పటికే సిద్ధమైన 6,807 మందిలో, 62 శాతం మంది తమ బుకింగ్‌లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 38 శాతం మంది మాత్రమే తమ పర్యటనలను కొనసాగించాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, భవిష్యత్తులో ప్రయాణాల గురించి అడిగినప్పుడు కూడా, 29 శాతం మంది మాత్రమే రాబోయే మూడేళ్లలో కశ్మీర్‌ను సందర్శించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. 33 శాతం మంది కశ్మీర్‌లో భద్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.

నమ్మకంపై ఆధారపడిన టూరిజం

మరోవైపు, టూర్ ఆపరేటర్లు తాజా పరిణామాలపై ప్రభుత్వ జోక్యంపై ఆశలు పెట్టుకున్నారు. మెరుగైన భద్రతా చర్యలు, పర్యాటకుల్లో విశ్వాసాన్ని పెంచేలా భరోసా ఇవ్వాలని ఆశిస్తున్నారు. దాడికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి, అయితే ప్రజలకు ఈ ప్రాంతంపై తిరిగి నమ్మకం ఏర్పడేందుకు సమయం పట్టవచ్చని వారు భావిస్తున్నారు. పర్యాటక రంగం నమ్మకంతో అభివృద్ధి చెందుతుంది. కశ్మీర్‌లో ఇప్పుడు ఆ నమ్మకాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఓ టూర్ ఆపరేటర్ అన్నారు.

Next Story