Amarnath Yatra: అమర్ నాథ్ యాత్ర.. 581 కేంద్రసాయుధ పోలీసులతో బందోబస్తు

by Shamantha N |

అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra) త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Amarnath Yatra: అమర్ నాథ్ యాత్ర.. 581 కేంద్రసాయుధ పోలీసులతో బందోబస్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra) త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 581 కేంద్ర సాయుధ పోలీసు (CAPF) బలగాలతో, జామర్లు, డ్రోన్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 22న పహెల్గాం దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన నేపథ్యంలో, ఈసారి యాత్రపై పూర్తి స్థాయి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. యాత్ర మార్గాల్లో రోడ్ ఓపెనింగ్ పార్టీలు (ROPs), క్విక్ యాక్షన్ టీమ్స్ (QATs), బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ (BDS), కె9 డాగ్ యూనిట్లు, డ్రోన్లు సైతం పనిచేయనున్నాయి. అయితే ఈసారి తొలిసారిగా జామర్లు అమర్చనున్నారు. వీటి ద్వారా యాత్రికుల కదలికల సమయంలో ఎలాంటి సాంకేతిక వాహన దాడులు జరగకుండా ముందస్తుగా నివారిస్తారు. అంతేకాకుండా, సీఏపీఎఫ్ బలగాలు యాత్రకు తగిన రక్షణను కల్పించనున్నాయి. భక్తుల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు జాతీయ రహదారులను తాత్కాలికంగా మూసివేయనున్నారు. భద్రత, శాంతి భద్రతల సమన్వయంతో యాత్ర నిర్వహణకు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. అమరనాథ్ శ్రైన్ బోర్డు, జమ్ముకశ్మీర్ డివిజనల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు, ఇతర సెక్యూరిటీ ఏజెన్సీలు కలిసి భద్రత, లాజిస్టిక్స్, యాత్ర నిర్వాహణపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గ్యానేంద్ర ప్రతాప్ సింగ్ స్వయంగా పహెల్గాం, జమ్ము, బేస్ క్యాంపులు, యాత్రి నివాస్‌లను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు భద్రతతో పాటు, అనుకూల వాతావరణం కల్పించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అమర్ నాథ్ యాత్ర

హిందువుల పవిత్ర అమరనాథ్ యాత్ర జమ్ముకశ్మీర్ హిమాలయాల్లో 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న గుహ వద్దకు జరిగే యాత్ర. ఈ నెల జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది. ఇందులో సహజంగా ఏర్పడే ఐస్ శివలింగంని దర్శించుకునేందుకు లక్షలాది భక్తులు విచ్చేస్తారు. శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) ఈ యాత్ర నిర్వహిస్తారు. అయితే, పత్రి సంవత్సరం దాదాపు 52 రోజుల పాటు అమర్ నాథ్ యాత్ర కొనసాగుతోంది. కానీ, ఈ సంవత్సరం యాత్ర 52 రోజుల యాత్రను కుదించి 38 రోజులకు పరిమితం చేశారు. దీనివల్ల యాత్ర మరింత సమర్థంగా నిర్వహించేలా లక్ష్యంగా పెట్టుకున్నారు.

Next Story