వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి

by Naga Rani Yarlagadda |

గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 34 మంది మరణించారు.

వరదల్లో చిక్కుకుని, కొండ చరియలు విరిగిపడి 34 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గత మూడు రోజులుగా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 34 మంది మరణించారు. వరద సహాయక చర్యల కోసం వైమానిక దళం, అస్సాం రైఫిల్స్‌ను పిలిపించారు.

ఉత్తర సిక్కింలో 1,200 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఆదివారం నాడు తరలింపు జరగాల్సి ఉండగా.. కొత్తగా కొండచరియలు విరిగిపడ్డాయి. మే 29న మున్షితాంగ్ వద్ద తీస్తా నదిలో వాహనం పడిపోవడంతో ఎనిమిది మంది పర్యాటకులు గల్లంతయ్యారు. వారి జాడ ఇంకా తెలియలేదు. మేఘాలయలో 10 జిల్లాలు ఆకస్మిక వరదలు , కొండచరియలు విరిగిపడటంతో ప్రభావితమయ్యాయి. త్రిపురలో 10,000 మందికి పైగా ప్రజలు ఆకస్మిక వరదల బారిన పడ్డారు.

అస్సాంలో, 19 జిల్లాల్లోని 764 గ్రామాలు ఆకస్మిక వరదలకు గురయ్యాయి, దీని వలన 3.6 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఈరోజు మరో ఇద్దరు మరణించడంతో, అస్సాంలో వరదలు, కొండచరియలు విరిగిపడిన మృతి చెందినవారి సంఖ్య 10కి పెరిగింది. దిబ్రూగఢ్, నీమతిఘాట్, ఇతర ప్రాంతాలలో బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. మరో ఐదు నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 10,000 మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు.

వరద బాధిత ప్రాంతాలకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఆయన అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులతో, మణిపూర్ గవర్నర్‌తో మాట్లాడారు. "అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ, మణిపూర్ గవర్నర్‌తోనూ మాట్లాడాను. ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవడానికి వారికి సాధ్యమైనంత సహాయం చేస్తామని హామీ ఇచ్చాను. ఈశాన్య ప్రాంత ప్రజలకు మద్దతుగా మోడీ ప్రభుత్వం నిలుస్తుంది" అని Xలో పోస్ట్ చేశారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించినట్లు అస్సాం మంత్రి జయంత మల్లాబరువా తెలిపారు.

Next Story