మూడేళ్ల చిన్నారి మృతి.. చర్చనీయాంశంగా మారిన సల్లేఖన దీక్ష

by Naga Rani Yarlagadda |

ఐటీ నిపుణులైన పీయూష్, వర్షా జైన్ దంపతుల ఏకైక కుమార్తె వియానా. గత డిసెంబర్‌లో ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. ముంబైలో శస్త్రచికిత్సతో సహా చికిత్స చేసినా ఆమె కోలుకోలేదు.

మూడేళ్ల చిన్నారి మృతి.. చర్చనీయాంశంగా మారిన సల్లేఖన దీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మూడేళ్ల చిన్నారి వియానా జైన్‌కు సల్లేఖన దీక్ష (sallekhana deeksha) ఇవ్వడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. జైన మత విశ్వాసాల ప్రకారం, సల్లేఖన అంటే ఆహారం, నీరు తీసుకోకుండా శరీరాన్ని క్షీణింపజేస్తూ స్వచ్ఛందంగా మరణాన్ని ఆహ్వానించడం. సాధారణంగా వృద్ధులు ఈ ఆచారాన్ని అనుసరిస్తారు. అయితే.. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న వియానా తల్లిదండ్రులు ఆమెకు ఈ దీక్ష నిర్వహించారు. దీక్ష ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వియానా మరణించింది. ఇది నైతిక, చట్టపరమైన ప్రశ్నలను లేవనెత్తింది.

ఐటీ నిపుణులైన పీయూష్, వర్షా జైన్ దంపతుల ఏకైక కుమార్తె వియానా. గత డిసెంబర్‌లో ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. ముంబైలో శస్త్రచికిత్సతో సహా చికిత్స చేసినా ఆమె కోలుకోలేదు. ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటంతో, జైన మత విశ్వాసులైన ఈ కుటుంబం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. మార్చి 21న జైన గురువు రాజేష్ ముని మహరాజ్ సలహాతో వియానాకు సల్లేఖన దీక్ష చేపట్టారు. "మా సమ్మతితోనే ఈ దీక్ష జరిగింది. పది నిమిషాల్లో వియానా మరణించింది" అని వర్షా జైన్ తెలిపారు.

ఈ ఘటన 'గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో (golden book of the world records) అతి చిన్న వయసులో సల్లేఖన దీక్ష స్వీకరించిన వ్యక్తిగా వియానా పేరు నమోదవడంతో వెలుగులోకి వచ్చింది. అయితే, మరణం యొక్క అర్థాన్ని గ్రహించలేని వయసులో ఉన్న చిన్నారి తరఫున ఈ నిర్ణయం ఎవరు తీసుకోవచ్చనే ప్రశ్న ఉద్భవించింది. సుప్రీంకోర్టు న్యాయవాది రితేష్ అగర్వాల్ మాట్లాడుతూ, "మైనర్ల జీవన, మరణ నిర్ణయాలు తల్లిదండ్రులకు కూడా అధికారం లేదు. మత స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది చట్టానికి అతీతం కాదు" అని అన్నారు. సల్లేఖన చట్టబద్ధతపై గతంలో విభిన్న తీర్పులు వచ్చినప్పటికీ, మైనర్ల విషయంలో స్పష్టత లేదు. ఇండోర్ పోలీసులు ఈ ఘటనపై తమకు సమాచారం లేదని, ఎలాంటి రికార్డు లేదని అదనపు డీసీపీ రాజేష్ దండోటియా తెలిపారు.

Next Story