28 వారాల గర్భాన్ని తొలగించలేము: అవివాహిత మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు

by Dishanational2 |
28 వారాల గర్భాన్ని తొలగించలేము: అవివాహిత మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: 28వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతివ్వాలని కోరుతూ 20ఏళ్ల అవివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పూర్తిగా ఆరోగ్యకరమైన పిండాన్ని తొలగించలేమని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్‌తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. భ్రూణహత్యలను అనుమతించలేమని తేల్చి చెప్పింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 24 వారాలలోపు గర్భాన్ని రద్దు చేయొచ్చు. కానీ 28 వారాలు కావడంతో వైద్యులు గర్భాన్ని తొలగించడానికి నిరాకరించారు. దీంతో ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే తాను గర్భం దాల్చిన సంగతి తనకు తెలియదని, ఇటీవలే ఈ విషయం బయటపడిందని తన పిటిషన్‌లో పేర్కొంది. తన తరఫున వాదించిన లాయర్ సైతం ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళ మానసిక, శారీరక స్థితితో పాటు పిండం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆమెకు వైద్య పరీక్షలు చేయించాలని, ఇందుకు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ని ఆదేశించాలని పిటిషనర్ తరఫు అడ్వకేట్ కోర్టును కోరారు.ఈ నెల 1వ తేదీనే దీనిపై వాదనలు ముగిసినప్పటికీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి..సోమవారం వెల్లడించింది. గర్భాన్ని తొలగించే ప్రసక్తే లేదని తెలిపింది.



Next Story