6 రోజులు.. 22 ర్యాలీలు.. కర్ణాటకలో ప్రధాని మోడీ ప్రచార షెడ్యూల్

by Disha Web Desk 13 |
6 రోజులు.. 22 ర్యాలీలు.. కర్ణాటకలో ప్రధాని మోడీ ప్రచార షెడ్యూల్
X

బెంగళూరు: కర్ణాటక అంసెబ్లీకి ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న వేళ బీజేపీ ప్రచార జోరు పెంచనుంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈ శనివారం ప్రచారంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ప్రధాని మోడీ ప్రచార షెడ్యూల్‌లో బెంగళూరులో రోడ్ షో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. రాబోయే పదిహేను రోజుల్లో మోడీ 22 ర్యాలీలు నిర్వహించనున్నారు. ఆరు రోజుల పర్యటనలో బీజేపీ స్టార్ కంపెయినర్ (మోడీ) 22 ర్యాలీలు నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు చెప్పాయి. ప్రతి పర్యటనలో మోడీ మూడు కంటే ఎక్కువ ర్యాలీల్లో పాల్గొంటారు. ‘కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్న నమ్మకముంది.

కానీ ప్రధాని మోడీ రణరంగంలోకి దిగితే ఆ గేమే డిఫరెంట్‌గా ఉంటుంది. మా పార్టీ ప్రచారం జోరందుకోవడానికి అది ఎంతో ఉత్సాహానిస్తుంది’ అని బీజేపీ సీనియర్ నేత అన్నారు. ఏప్రిల్ 29న హుమ్నాబాద్, విజయపుర, కుడాచి, బెంగళూరు నార్త్‌లలో మోడీ రాల్యీల్లో పాల్గొంటారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మరుసటి రోజు అంటే 30వ తేదీ కోలార్, చన్నపట్టణ, బేలూరు ర్యాలీల్లో పాల్గొంటారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం మోడీ వచ్చే వారం తిరిగి కర్ణాటక రానున్నారు. మే 2న చిత్రదుర్గ, విజయనగరం, సింధనూరు, కలబురిగి, మే 3న మూడబిద్రి, కార్వార్, కిత్తూరు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.


Next Story