17 మంది ఎంపీలకు సన్సద్ రత్న-2025 అవార్డులు

by Phanindra |

17 మంది ఎంపీలకు సన్సద్ రత్న-2025 అవార్డులు అందనున్నాయి. వీరితోపాటు రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు కూడా ఈ అవార్డు అందనుంది.

17 మంది ఎంపీలకు సన్సద్ రత్న-2025 అవార్డులు
X

దిశ, నేషనల్ బ్యూరో: 17 మంది ఎంపీలకు సన్సద్ రత్న -2025 అవార్డులు అందించనున్నట్లు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ అవార్డు అందుకునే నేతల్లో ఎన్సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, భర్తృహరి మహ్తాబ్, రవికిషన్ తదితరులున్నారు. ఈ అవార్డులు ఎవరికివ్వాలో నిర్ణయించే జ్యూరీకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) చైర్మన్ హన్సరాజ్ ఆహిర్ చైర్మన్‌గా ఉన్నారు. పార్లమెంటుకు మేటిగా సేవ చేస్తున్న వారికి ఈ అవార్డు అందిస్తారు. 16, 17వ లోక్‌సభల్లో కూడా మహ్తాబ్, సుప్రియా సూలే, ఆర్‌ఎస్పీ నేత ఎన్కే ప్రేమచంద్రన్, శ్రీరంగ అప్ప బర్నె టాప్ పెర్ఫామర్లుగా నిలిచారు.

ఈసారి సన్సద్ రత్న-2025 అవార్డు అందుకునే వారిలో కూడా ఈ నలుగురూ ఉండటం గమనార్హం. వీరితోపాటు బీజేపీకి చెందిన స్మిత వాగ్, మేధా కులకర్ణి, ప్రవీణ్ పటేల్, రవి కిషన్, నిషికాంత్ దూబే, బిద్యుత్ బరన్ మహతో, పీపీ చౌదరీ, మదన్ రాథోర్, దిలీప్ సైకియాకు కూడా ఈ అవార్డు దక్కనుంది. శివసేన (యూబీటీ)కి చెందిన అరవింద్ సావంత్, శివసేనకు చెందిన నరేష్ గణపత్ మాస్కే, కాంగ్రెస్ నేత వర్ష గైక్వాడ్, డీఎంకే నేత సీఎన్ అన్నాదురై కూడా ఈ అవార్డు అందుకోనున్నారు.

అలాగే ఫైనాన్స్, వ్యవసాయ శాఖలకు చెందిన రెండు స్టాండింగ్ కమిటీలకు కూడా ఈ అవార్డు అందనుంది. ఫైనాన్స్‌పై స్టాండింగ్ కమిటీకి మహ్తాబ్ చైర్మన్‌గా ఉండగా, వ్యవసాయంపై కమిటీకి కాంగ్రెస్‌కు చెందిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ చైర్మన్‌గా ఉన్నారు.

Next Story