మూడ్రోజుల్లో 11 మంది పాక్ గూఢచారులు అరెస్ట్.. పాక్ వలలో ఎలా పడ్డారు?

by Phanindra |   (  Updated:2025-05-19 15:57:47  IST  )

మూడ్రోజుల్లో 11 మంది పాక్ గూఢచారులు అరెస్టయ్యారు. వీరంతా పాక్ వలలో ఎలా పడ్డారు?

మూడ్రోజుల్లో 11 మంది పాక్ గూఢచారులు అరెస్ట్.. పాక్ వలలో ఎలా పడ్డారు?
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత దేశంలో ఉంటూ పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న వారిపై భారత ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత మూడ్రోజుల్లో పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న 11 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హరియాణాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా ఒకరు. పాక్‌కు చాలా సున్నితమైన సమాచారాన్ని ఆమె చేరవేసినట్లు అధికారులు చెప్తున్నారు. ఆమెతోపాటు ఇలా అరెస్టయిన వారిలో స్టూడెంట్లు, ఒక సెక్యూరిటీ గార్డు, ఒక యాప్ డెవలపర్ కూడా ఉన్నారు.

అసలు ఎందుకు?

భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌కు గూఢచర్యం చేసేందుకు వీళ్లంతా ఎలా ఒప్పుకున్నారో చాలామందికి అర్థం కావడం లేదు. అయితే వీళ్లలో చాలామందితో పాకిస్థాన్ ఉగ్రవాదులు సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత భారీగా డబ్బులు ఆశ చూపించి, అబద్ధపు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించారు. వ్యక్తిగతంగా వీళ్లను పాకిస్తాన్‌కు తీసుకెళ్లి, రకరకాల ఆఫర్లతో వీళ్లను తమ ఊబిలో చిక్కుకునేలా చేశారని అధికారులు చెప్తున్నారు. ఇలా 20-30 సంవత్సరాల వయసున్న కుర్రాళ్లతో గూఢచర్యం చేపించడం, సామాన్య యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా రహస్యాలు సేకరించడం చూస్తుంటే.. ఈ గూఢచర్యం ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

పాక్ గూఢచారులు వీళ్లే..

గజాలా, యామీన్: డబ్బుల కోసం పాకిస్థానీ ఏజెంట్లతో సమాచారాన్ని పంచుకుంటున్నారన్న ఆరోపణలతో పంజాబ్‌ పోలీసులు గజాలా, యామీన్ మహమ్మద్‌లను అరెస్ట్ చేశారు. మాలెర్‌కోట్లాకు చెందిన వీళ్లిద్దరూ.. పాకిస్థాన్ హై కమిషన్‌ మాజీ ఉద్యోగి డానిష్‌తో కలిసి పనిచేసినట్లు సమాచారం. పాకిస్థానీ వీసాల కోసం డానిష్‌ను పలుమార్లు కలిసిన వీళ్లకు అతను భారీగా డబ్బులు అందించేవాడు. దాన్ని స్థానికంగా పాక్ కోసం పనిచేస్తున్న వారికి చేరవేయడం గజాలా, యామీన్ బాధ్యత.

జ్యోతి మల్హోత్ర: పాక్ గూఢచర్యం కేసులో జ్యోతి అరెస్టవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ‘ట్రావెల్ విత్ జో’ అనే యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న ఆమెను పాక్‌ గూఢచారిగా తయారు చేయాలని పాకిస్థాన్ ప్రయత్నించింది. హిసార్‌కు చెందిన ఆమె 2023, 2024, 2025 మార్చిలో పహెల్గాం ఉగ్రదాడికి ముందు కూడా పాకిస్థాన్ వెళ్లొచ్చింది. పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డనాష్‌తో కలిసి ఆమె పనిచేసినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీడియోలు చేసి, అక్కడి విషయాలను తమకు చేరవేసే విధంగా ఆమెను పాకిస్థానీలు ఉపయోగించుకున్నట్లు అనుమానిస్తున్నారు.

దేవేందర్ సింగ్: పంజాబ్‌లోని పటియాలాకు చెందిన దేవేందర్ సింగ్.. ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. హరియాణాలోని కైథాల్‌లో ఉండగా పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్టు చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్లతో సున్నితమైన సమాచారాన్ని దేవేందర్ పంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. పటియాలా మిలటరీ కంటోన్‌మెంట్‌ ఫొటోలను కూడా పాక్‌కు అతను పంపినట్లు సమాచారం. గతేడాది నవంబరులోనే పాక్‌కు కూడా దేవేందర్ వెళ్లొచ్చినట్లు విచారణలో తేలింది.

అర్మాన్: హరియాణాలోని నూహ్‌కు చెందిన అర్మాన్ కూడా భారత ఆర్మీ, వారి మిలటరీ కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను పాకిస్థాన్‌కు చేరవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ఫోన్ నుంచి పాకిస్థానీ నంబర్లతో అర్మాన్ చేసిన చాట్స్, పంపిన ఫొటోలు, వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వాట్సాప్‌లో భారత మిలటరీ కార్యకలాపాలను పాకిస్థాన్‌కు అర్మాన్ చేరవేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరీఫ్: ఇతను కూడా హరియాణాలోని నుహ్‌కు చెందిన వాడే కావడం గమనార్హం. విచారణ సమయంలో తను పాకిస్థాన్ ఎంబసీకి చెందిన ఇద్దరు ఉద్యోగులతో టచ్‌లో ఉన్నట్లు తరీఫ్ అంగీకరించాడు. వాళ్లే అతనికి సిమ్ కార్డులు ఇచ్చారని చెప్పాడు. పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లొచ్చిన తర్వాత.. సిర్సా వెళ్లి అక్కడి ఎయిర్‌పోర్టు ఫొటోలు పంపాలని కోరినట్లు తరీఫ్ వెల్లడించాడు.

నౌమన్ ఇల్లాహీ: హరియాణాలోని పానిపట్ నుంచి మే 15వ తేదీన నౌమన్ ఇల్లాహీని పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్‌తో నౌమన్ టచ్‌లో ఉన్నట్లు తేలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతను ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పాక్‌కు సున్నితమైన సమాచారాన్ని పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతను.. పలుమార్లు పాకిస్థాన్ వెళ్లొచ్చాడు.

మహమ్మద్ ముర్తాజా అలీ: పంబాబ్‌లోని జలంధర్‌కు చెందిన మహమ్మద్ ముర్తాజా అలీ.. సొంతంగా ఒక మెసేజింగ్ యాప్ తయారు చేసి, దాని ద్వారా పాకిస్థాన్‌ ఐఎస్ఐకి సమాచారాన్ని చేరవేసేవాడు. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు.. ముర్తాజా వద్ద నుంచి మూడు సిమ్ కార్డులు, నాలుగు మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

షెహజాద్: పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న షెహజాద్ అనే వ్యక్తిని యూపీలోని యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. రాంపూర్‌కు చెందిన అతను పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లొచ్చాడని, పాక్ నుంచి అక్రమ పద్ధతుల్లో కాస్మెటిక్స్, దుస్తులు, మసాలా దినుసులు, ఇతర వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నాడని అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ రాకెట్‌ను అడ్డుపెట్టుకొని పాకిస్థాన్‌కు సమాచారాన్ని చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. పలువురు ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు పెట్టుకొని, భారత భద్రతకు చెందిన సమాచారాన్ని వారికి చేరవేసినట్లు షెహజాద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐ కోసం భారత్‌లో కొన్ని కార్యకలాపాలకు కూడా షెహజాద్ పాల్పడినట్లు అధికారులు తెలియజేశారు.

సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్: వీళ్లిద్దర్నీ పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు వీళ్లిద్దరూ చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. భారత దళాల కార్యకలాపాలతోపాటు పంజాబ్‌, హిమాచాల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్‌లోని వ్యూహాత్మక ప్రాంతాల వివరాలను కూడా వీల్లు పాక్‌కు చేరవేసినట్లు పంజాబ్ డీజీపీ తెలియజేశారు. పహెల్గాం దాడి తర్వాత సుఖ్‌ప్రీత్‌, కరణ్‌బీర్‌లను ఐఎస్ఐ యాక్టివ్ చేసిందని, వీళ్ల ఖాతాలకు చెరో రూ.లక్ష పంపిందని ఆయన వెల్లడించారు. వీళ్లు డ్రగ్స్ స్మగ్లింగ్‌కు కూడా పాల్పడినట్లు తెలిపారు.

Next Story
null