డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు: వినూత్న శిక్ష విధించిన పోలీసులు

by Dishafeatures2 |
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు:  వినూత్న శిక్ష విధించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: తాగి వాహనం నడిపితే వేయి రూపాయల జరిమానో లేక లైసెన్స్ రద్దు చేయడం లాంటివి చేస్తారు. లేదంటే కొన్ని రోజుల పాటు జైలు శిక్ష వేస్తారు. కానీ తాగి బస్సు నడిపిన డ్రైవర్లకు కేరళ పోలీసులు వినూత్న శిక్ష వేశారు. డ్రైవర్లందరిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి స్కూల్ పిల్లలకు రాయించినట్లు వాళ్ల చేత ''తాగి వాహనం నడపను'' అంటూ వెయ్యి సార్లు రాయించారు. వివరాల్లోకి వెళ్తే.. త్రిప్పునిథుర హిల్ ప్యాలెస్ పోలీసు స్టేషన్ సీఐ వి.గోపకుమార్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించింది. ఈ టెస్ట్ లో 16 మంది డ్రైవర్లు పట్టుపడ్డారు. అందులో ఇద్దరు KSRTC డ్రైవర్లు, 10 మంది ప్రైవేట్ బస్సు డ్రైవర్లు, నలుగురు స్కూల్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. వాళ్లందరినీ త్రిప్పునిథుర హిల్ ప్యాలెస్ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.

అనంతరం వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరికి పెన్ను, కాపీ చేతికిచ్చారు. ఏం చేయాలో పాలుపోని డ్రైవర్లందరూ పోలీసుల వైపు విచిత్రంగా చూశారు. వెంటనే ఓ పోలీసు వాళ్ల వద్దకు వచ్చి '' ఇప్పటి నుంచి తాగి వాహనం నడపను'' అంటూ వెయ్యి సార్లు రాయించారు. నిత్యం స్టీరింగ్ తిప్పడమే తప్ప పెన్ను పట్టని ఆ డ్రైవర్లు.. మొత్తానికి పోలీసులు ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేశారు. ఇక బస్సుల్లోని ప్రయాణికులు, విద్యార్థులను పోలీసులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా వాళ్ల గమ్య స్థానాలకు చేర్చారు. తాగి బస్సు నడిపిన 16 మంది బస్సు డ్రైవర్లపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని సీఐ గోపకుమార్ తెలిపారు.


Next Story