వందేళ్ల క్రితం పోస్టర్లను అంటించిన వారిని బ్రీటీషర్లు కూడా అరెస్ట్ చేయలేదు: ప్రధానిపై కేజ్రీవాల్ విమర్శలు

by Disha Web Desk 17 |
వందేళ్ల క్రితం పోస్టర్లను అంటించిన వారిని బ్రీటీషర్లు కూడా అరెస్ట్ చేయలేదు: ప్రధానిపై కేజ్రీవాల్ విమర్శలు
X

న్యూఢిల్లీ: వందేళ్ల క్రితం పోస్టర్లను అంటించిన వారిని బ్రీటీషర్లు కూడా అరెస్ట్ చేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వందేళ్ల క్రితం బ్రిటీష్ వాళ్లు సైతం పోస్టర్లు అతికించిన వారిని అరెస్ట్ చేయలేదు. కానీ పోస్టర్లు అతికించినందుకు ప్రధాని మోడీ వచ్చి ఒక్క రాత్రిలో 138 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేస్తారని ఎవరికి మాత్రం తెలుసు? అసలేం జరుగుతోంది. గత 24 గంటల్లో ఆరుగురిని అరెస్ట్ చేశారు. అందులో ఒక ప్రింటర్ కూడా ఉన్నాడు. ఈ ఆరుగురు చాలా పేదవారు. ఈ అరెస్టుల వెనుక మన ప్రధాని ఉన్నారు.

మోడీ హటావో దేశ్ బచావో అన్న పోస్టర్లలో పెద్ద విషయమేమీ లేదు. ఎందుకు ప్రధాని అభద్రతా భావంతో అందరినీ జైల్లో పెట్టిస్తున్నారు? ఆయనను ప్రశాంతంగా నిద్ర పొమ్మని చెప్పండి. ఎందుకంటే మూడు గంటలు మాత్రమే నిద్రపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆయన నిద్ర రుగ్మతతో బాధపడుతున్నట్టున్నారు. నిద్రపట్టకపోతే ఒక మంచి డాక్టర్ వద్ద చూపించుకోవాలి. ప్రతిసారీ ఆయన విసిగిస్తున్నారు. అందరినీ జైల్లో పెట్టాలనుకుంటున్నారు. ప్రధాని మోడీకి మంచి ఆరోగ్యం దయచేయమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని కేజ్రీవాల్ అన్నారు.

ముఖ్యంగా ఆయన వైఖరిలో చాలా మార్పు కనిపించింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతకు బహిరంగంగా మద్దతు తెలిపారు. బీజేపీయేతర నాయకులను, పార్టీలను అడ్డు తొలగించుకునేందుకు కుట్ర పన్నుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. కాంగ్రెస్ ఆప్ పార్టీలు గతంలో అనేక విషయాల్లో ఒకదానినొకటి విమర్శించుకున్నాయి.

Next Story

Most Viewed