డీజీపీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసు

by  |
డీజీపీకి జాతీయ బీసీ కమిషన్ నోటీసు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయకుమార్ పట్ల దురుసుగా ప్రవర్తించిన సిద్దిపేట పోలీసు అధికారులకు చర్యలెందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ బీసీ కమిషన్ సంజాయిషీ నోటీసు జారీ చేసింది. సిద్దిపేట ఘటనకు సంబంధించి నవంబరు 5వ తేదీకల్లా నివేదిక సమర్పించాలని కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి డెడ్‌లైన్ విధించారు. వెనకబడిన వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్ పట్ల సిద్దిపేటలో ఈనెల 26వ తేదీన పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని, కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఓబీసీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా కూడా ఉన్నారని ఆచారి గుర్తుచేశారు.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల నివాసాలపై సిద్దిపేటలో ఈనెల 26వ తేదీన పోలీసులు సోదాలు నిర్వహించిన సందర్భంగా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించిన బండి సంజయ్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, పత్రికల్లో ప్రచురితమైన, టీవీ ఛానెళ్ళలో వచ్చిన ప్రసారాల నేపథ్యంలో సూమోటోగా తీసుకున్నట్లు ఆచారి పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేసే అధికారం జాతీయ బీసీ కమిషన్‌కు ఉందని, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను, ఆధారాలను కమిషన్‌కు సమర్పించాలని ఆచారి స్పష్టం చేశారు. ఈ సంఘటనలో పాలుపంచుకున్న పోలీసు సిబ్బందిపై తగిన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరణ ఇవ్వాలని డీజీపీని ఆ నోటీసులో ప్రశ్నించారు. ఓబీసీ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే కమిషన్‌కు ఆ సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను అందజేయాలని డీజీపీకి స్పష్టం చేశారు.



Next Story