నాట్కో ఫార్మా త్రైమాసిక లాభంలో 23 శాతం క్షీణత!

by  |
నాట్కో ఫార్మా త్రైమాసిక లాభంలో 23 శాతం క్షీణత!
X

ముంబయి: ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన చివరి త్రైమాసికంలో ఔషధ సంస్థ నాట్కో ఫార్మా ఏకీకృత నికర లాభం రూ. 93.2 కోట్లతో 22.59 శాతం మేర క్షీణించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కంపెనీ రూ. 120.4 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు నాట్కో ఫార్మా స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 477.2 కోట్లుగా ఉంది. అంతకుముందు ఇదే త్రైమాసికానికి రూ. 486.7 కోట్లని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ. 458.1 కోట్లు కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 642.4 కోట్లని నాట్కో ఫార్మా తెలిపింది. మార్చి 2020 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 2,022.4 కోట్లు. అంతకుముందు ఏడాది ఆర్థిక సంవత్సరానికి ఇది రూ. 2,224.7 కోట్లు. తమ వ్యాపార కార్యకలాపాలపై కొవిడ్-19 ప్రభావానికి సంబంధించి, ఫార్మా ఉత్పత్తులను అత్యవసరమైన వస్తువుల కింద వర్గీకరించినప్పటికీ, ఉత్పత్తి, పంపిణీ కార్యకలాపాలకు కొంత అంతరాయం ఏర్పడిందని కంపెనీ తెలిపింది. “సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో హెపటైటిస్ సీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో క్షీణత, ఆంకాలజీ విభాగంలో ధరల ఒత్తిడి కారణంగా కంపెనీ ఆదాయం, లాభాల్లో క్షీణత ఏర్పడిందని’ కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed