ఈటల తప్పుచేశారని ఆయనకూ తెలుసు.. భూములిచ్చేయండి : ఎమ్మెల్యే మదన్ రెడ్డి

by  |
ఈటల తప్పుచేశారని ఆయనకూ తెలుసు.. భూములిచ్చేయండి : ఎమ్మెల్యే మదన్ రెడ్డి
X

దిశప్రతినిధి, మెదక్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలలో అన్యాక్రాంతమైన పేద రైతుల భూములను తిరిగి ఇప్పిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. భూములు కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేయాలని కలెక్టర్ హరీష్‌ను డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని కోరారు. బుధవారం సాయంత్రం అచ్చంపేట గ్రామానికి వచ్చిన ఆయన జమున హ్యచరీస్ ఎదుట విలేకరులతో మాట్లాడారు. పేదలకు న్యాయం చేయడం ఎమ్మెల్యేగా తన బాధ్యత అని మదన్ రెడ్డి చెప్పారు. అన్యాక్రాంతమైన భూముల గురించి సీఎం దృష్టికి తీసుకవెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. భూములు వచ్చిన తరువాత ఆర్థికంగా నిలుదొక్కుకోవడానికి సహాయం చేయిస్తానని హామీ ఆయన ఇచ్చారు.

అచ్చంపేట, హకీంపేటలో అన్యాక్రాంతమైన భూములు ప్రజలవని ఈటల రాజేందర్ మనసుకు తెలుసని మదన్ రెడ్డి అన్నారు. ఎంతో కాలంగా ఎమ్మెల్యేగా పని చేస్తున్న ఈటల రాజేందర్ అనుభవజ్ఞులన్నారు. పేదల భూములను ఈటల తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని, చట్టం ఎప్పుడూ తన పనిని తాను చేసుకుంటూ పోతుందని మదన్ రెడ్డి చెప్పారు. అన్యాక్రాంతమైన భూములను సాధించుకునే వరకు శాంతియుతంగా ఉద్యమం చేయాలని కోరారు. సర్వే అనంతరం భూములు కోల్పోయిన పేదలందరికీ న్యాయం జరిగేలా చూస్తానని గట్టిగా హామీ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story