అక్కడ మోదీ మాస్కులదే హవా..

by  |
అక్కడ మోదీ మాస్కులదే హవా..
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్ టైమ్‌లో పనుల్లేక ఖాళీగా కూర్చున్నారు. అయితే అదే కరోనా.. ఓ కొత్త ఉపాధి మార్గాన్ని కూడా కల్పించడం విశేషం. వ్యాక్సిన్ వచ్చేంత వరకు కరోనా సోకకుండా అందరూ విధిగా మాస్క్ ధరించి, సోషల్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయడంతో ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో మాస్క్, శానిటైజర్స్, హ్యాండ్ వాష్, గ్లౌవ్స్‌లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. ఇదే క్రమంలో చాలా మంది మ్యాచింగ్ మాస్క్‌లు కూడా తయారు చేస్తున్నారు. మరికొన్ని దేశాల్లో అయితే మరింత ముందుచూపుతో ఆలోచించి.. బికినీలకు కూడా సూటయ్యే మాస్క్‌లు రూపొందించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే భోపాల్‌లోని కొందరు వ్యాపారులు.. పలువురు నాయకుల ఫొటోలతో ఉన్న మాస్క్‌లు అమ్ముతున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్ రాజ్‌సింగ్ చౌహన్‌, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత కమల్‌నాథ్‌ల మాస్క్‌లను భోపాల్‌లో విక్రయిస్తుండగా, అందులో అత్యధికంగా మోదీ మాస్క్‌కు గిరాకీ ఉన్నట్లు షాప్ యజమానులు చెబుతున్నారు. ‘ఇప్పటికే నేను 500 – 1000 మోదీ మాస్కులను అమ్మాను. మా రాష్ట్ర సీఎం ఉన్న మాస్కులు కూడా బాగా పాపులరే. రాహుల్ గాంధీ, కమల్‌నాథ్ చిత్రాలున్న మాస్కులకు కూడా గిరాకీ బాగానే ఉంది.’ అని భోపాల్‌లోని ఓ వ్యాపారి తెలిపారు.

కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ దాదాపు 11 వేల కేసులు నమోదవగా.. 465 మంది చనిపోయారు. అయితే ఎక్కడికెళ్లినా మాస్క్ తప్పనిసరే కానీ.. బ్యాంకు, జ్యువెలరీ షాప్‌లకు వెళ్లినప్పుడు 30 సెకన్ల పాటు మాస్క్ తీయాల్సిందిగా పోలీసులు చెబుతున్నారు. సెక్యూరిటీ కారణంగా సీసీటీవీలో వారి ఫోటోలు క్యాప్చర్ చేసేందుకు ఈ నిబంధన విధించారు. ఉత్తరాఖండ్, కేరళ, ఒడిషా, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీలో మాస్క్ ధరించకపోతే.. రూ. 5 వేలు ఫైన్ విధిస్తుండగా, మన రాష్ర్టంలో రూ. 1000 జరిమానా వేస్తున్నారు.


Next Story