భార్య మెడలో పుస్తెలతాడు లాక్కెళ్లారని.. భర్త ఆత్మహత్య

by  |
suicide-..-insult
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. డబ్బుల కోసం పలుమార్లు వేధించడంతో పాటు భార్య మెడలోని పుస్తెలతాడును లాక్కుని పోవడంతో అవమానంగా భావించిన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధితులు డబ్బుల కోసం వేధింపులకు గురిచేసిన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని మూడవ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని దుబ్బకు చెందిన నాగరాజు (30) గంజ్‌ ఏరియాలో గుమాస్తాగా పనిచేసేవాడు. ఆ సమయంలోనే కోనసముందర్ గ్రామానికి చెందిన బాదాం శ్రీనివాస్‌కు చెందిన ధాన్యాన్ని సేకరించి అమ్మగా వచ్చిన డబ్బులను చెల్లించాడు. ఇంకా రూ.1.20 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే బాదం శ్రీనివాస్ నగరంలోని ఆర్య నగర్‌కు చెందిన లక్ష్మి నారాయణతో కలిసి నాగరాజును డబ్బుల కోసం వేధించసాగాడు.

ఇటీవల నాగరాజు కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయగా దానిని లాక్కుని చితకబాదారు. అప్పుడే మనస్తాపం చెందిన నాగరాజు గోదావరిలో దూకి చనిపోవాలనుకున్నా కుటుంబ సభ్యులు ఆపారు. బుధవారం తెల్లవారు జామున దుబ్బలోని నాగరాజు ఇంట్లోకి ప్రవేశించిన బాదం శ్రీనివాస్, లక్ష్మి నారాయణలు డబ్బుల కోసం అతనితో గొడవ పడ్డారు. చివరకు నాగరాజు భార్య మెడలోనుంచి బంగారు పుస్తెల తాడును బలవంతంగా లాక్కెళ్లారు. ఈ అవమానం భరించలేకపోయిన నాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పడకగదిలో ఉరేసుకున్నాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు మూడవ టౌన్ పోలిస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సూమారు 200 మంది పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద బైటాయించి నాగరాజు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో పాటు ఆయన మరణానికి కారకులైన బాదం శ్రీనివాస్, లక్ష్మీ నారాయణలను కఠినంగా శిక్షించాలని కోరారు.



Next Story

Most Viewed