కరోనాపై అప్రమత్తంగా వ్యవహరించాలి

by  |

అధికారులకు మున్సిపల్ శాఖ సెక్రెటరీ సూచన

దిశ, న్యూస్‌ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ పొడిగించడంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీస్, మెడికల్ అధికారులతో సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ అధికారులను సూచించారు. హైదరాబాద్‌లోని బేగంపేట మంత్రి కేటిఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారుల సమావేశంలో కరోనా వ్యాధి నివారణా చర్యలపై అర్వింద్ కుమార్ సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,జీహెచ్ఎంసీ పరిధిలో గుర్తించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనీ, ప్రజలు ఎక్కడా గుమిగూడకుండా ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తూ పోలీస్, మెడికల్ అధికారులకు సహకరించాలని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో ఇంటికే నిత్యావసర సరుకులు పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు వైద్య లేదా ఇతర సేవల కోసం 104 లేదా 040- 21111111 నెంబర్‌కు కాల్ చేసి సహాయం అడగొచ్చని తెలిపారు. అధికారుల బృందం కంట్రోల్ రూంలలో డే అండ్ నైట్ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో కావలసిన ఏర్పాట్లను చేసుకోవాలనీ, జోనల్ అధికారి పరిధిలో అన్ని వైద్య సౌకర్యాలతో అంబులన్స్‌‌లను అందుబాటు ఉంచుకోవాలని చెప్పారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనను ఉల్లంఘించకుండా చూడాలన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని దాతలు ముందుకు వస్తే పోలీస్ లేదా జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్‌తో పాటు జోనల్ అధికారులు పాల్గొన్నారు.

Tags: Review Meeting, GHMC, covid 19, Muncipal dept principal secretary, commissioner lokesh kumar



Next Story

Most Viewed