ఆ యువకుడు అలా చేసినందుకే కొట్టానన్న ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ ..

by  |
mla
X

దిశ, చార్మినార్: గులామ్ గౌస్ జిలానీ అనే యువకున్ని చెంపదెబ్బలు కొట్టిన కేసులో హుస్సేనీహాలం పోలీసులు చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై ఐపీసీ 341, 323, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ఎమ్మెల్యేకు సలామ్ చెయ్యలేదని తనను చెంపదెబ్బలు కొట్టాడని గులామ్ గౌస్ జిలానీ అనే యువకుడు హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన‌పై యాకుత్ పురా ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పందించారు. తన పరువు, ప్రతిష్టలు దిగజార్చేందుకే కొంత మంది ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 1994 నుంచి యాకుత్ పురా ఎమ్మెల్యేగా ఐదు పర్యాయాలు విజయం సాధించానన్నాడు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగిన తనపై ఒక చిన్న ఆరోపణ కూడా లేదన్నారు. చార్మినార్ ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

యువకుని వివాదంపై మాట్లాడుతూ.. ఆదివారం తెల్లవారు జామున చార్మినార్ బస్టాండ్ వద్ద ఆ యువకుడు అరుగు పై కూర్చొని ఉన్నాడు. అప్పుడే తాను ఓ శుభకార్యానికి వెళ్లి కారు పార్కు చేసి ఇంటికి వెళ్తున్నాను. ఆ యువకుడు వాటర్ బాటిల్‌‌ను కారు వెనుక డోర్‌పై విసిరేశాడు. ఇంత పెద్ద కారు నీకు కనిపిస్త లేదా? ఎందుకు కొట్టావని అడిగానన్నాడు. దానికి ఈ యువకుడు నిన్ను కొట్టలేదు కదా, నీకు తగలలేదు కదా అని అగౌరవంగా మాట్లాడాడని తెలిపారు. ఆ యువకుని మీద బస్తీ వాసులు కూడా ఫిర్యాదు చేస్తున్నారన్నాడు. అందుకే నాకు కోపం వచ్చి రెండు చెంప దెబ్బలు కొట్టానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చాడు. 25 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నాపై ఎన్నో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి వచ్చానని, ఇలాంటి కేసులతో నేను ఎవరికి భయపడే వాడిని కాదని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed