ఈజిప్టులో మమ్మీల ‘గోల్డెన్ పరేడ్’

by  |
ఈజిప్టులో మమ్మీల ‘గోల్డెన్ పరేడ్’
X

కైరో: ఈజిప్టు అనగానే పిరమిడ్లు, అందులోని మమ్మీల అవశేషాలు గుర్తుకువస్తాయి. అంతుచిక్కని రహస్యాలు చుట్టుముడతాయి. క్రీస్తుపూర్వం చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. వేల సంవత్సరాలుగా అప్పటి పాలకుల(ఫారోలు) మృతదేహాలను మమ్మీఫై చేసిన తీరు, వాటి చుట్టూ ముసురుకున్న రహస్యాలు, ఎప్పటికప్పుడు కొత్తగా తెలిసే ఆసక్తికర విషయాలు ఈజిప్టును ఇప్పటికీ ఒక ప్రత్యేక దేశంగా నిలబెడుతున్నాయి. తాజాగా, 22 ఫారోల మమ్మీలను ‘గోల్డెన్ పరేడ్‌’లో భాగంగా ఈజిప్షియన్ మ్యూజియం నుంచి నాలుగు మైళ్ల దూరంలో తెహ్రీర్ స్క్వేర్‌లో నిర్మించిన అధునాతన మ్యూజియానికి తరలించారు. ఈ ఘట్టాన్ని యావత్ దేశమంతా ఎంతో ఆసక్తిగా పరిశీలించింది. ఈ పరేడ్ చిత్రాలు, మ్యూజియం ప్రారంభోత్సవ వేడుకలను ప్రభుత్వ మీడియా శనివారం లైవ్ టెలికాస్ట్ చేసింది. 21 గన్ సెల్యూట్‌తో మమ్మీలు కొత్త మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాయి.

మమ్మీలకు ఏమాత్రం నష్టం చేకూరకుండా నైట్రోజన్ నింపిన్ కంటెయినర్‌లలో జాగ్రత్తగా కొత్త డెస్టినేషన్‌కు తరలించారు. 18 మంది రాజులు, 4 రాణుల మమ్మీలను వారు పాలించిన కాలాలకు అనుగుణంగా తీసుకెళ్లారు. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దంలో దక్షిణ ఈజిప్టును పాలించిన సెఖెనెన్రె తావో2 మమ్మీ ఈ పరేడ్‌లో తొలి రథంలో ఉండగా, 12వ శతాబ్దంలో రూల్ చేసిన 9వ రామ్సేస్ మమ్మీ చివరలో ఉంది. ఈ పరేడ్‌లో గ్రేట్ వారియర్ ఫారో రెండో రామ్సేస్(67ఏళ్లు పాలించారు), పవర్‌ఫుల్ క్వీన్(మహిళా ఫారో) హత్‌షేసుట్ కూడా ఉన్నారు. కొత్త మ్యూజియంలో ఈ మమ్మీలను సంక్షిప్త చరిత్రతో డిస్‌ప్లే చేయనున్నారు. మమ్మీల పరేడ్ చూస్తుంటే ఈజిప్షియన్ నాగరికతను కళ్లతో చూసిన అనుభూతి కలుగుతున్నదని, ఇది భావోద్వేగభరిత క్షణమని యునెస్కో డైరెక్టర్ ఆడ్రె అజలె తెలిపారు.

ఫారోలా శాపాలేనా?

ఫారోలు దైవాంశసంభూతులని అప్పట్లో పేర్కొనేవారు. అత్యంత శక్తివంతులని, మమ్మీల రూపంలోనూ వారి శక్తి నిలిచే ఉందని స్థానికుల్లో కొన్ని నమ్మకాలున్నాయి. వీటి చుట్టే మిస్టరీలు అల్లుకున్నాయి. 1922-23 కాలంలో ఈజిప్టు యువపాలకుడు టుటంకమన్ సమాధిని కనుగొన్నవారు శాపగ్రస్తులై మరణించారని ఇప్పటికీ కొందరు విశ్వసిస్తుంటారు. టుటంకమన్ సమాధిని కనుగొన్న లార్డ్ కార్నవన్ నెలల వ్యవధిలో బ్లడ్ పాయిజనింగ్‌తో మరణించడం, ఆ సమాధిని చూసిన ఫస్ట్ విజిటర్లూ అనూహ్యంగా మరణించడం ఇలాంటి మిస్టరీలకు తావిచ్చింది. తాజా గోల్డెన్ పరేడ్‌కు సూచకంగా కొన్ని అనూహ్య ఘటనలు ఈజిప్టులో జరిగాయన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈజిప్టులో ఇటీవలే జరిగిన భీకర రైలు ప్రమాదం, కైరోలో ఓ బిల్డింగ్ కూలిపోవడం, సూయెజ్ కెనాల్‌లో ఎవర్ గివెన్ నౌక కనీసం ఒక వారంపాటు చిక్కుకుపోవడం వంటివి ఇలాంటి సంకేతాలేనని అక్కడి సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.

Next Story