వాళ్లకు ప్రైవేటు కేంద్రాల్లోనే టీకా

by  |
వాళ్లకు ప్రైవేటు కేంద్రాల్లోనే టీకా
X

ముంబై: వయోజనులందరికీ టీకా వేసే సమయం సమీపిస్తున్నది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో 18 ఏళ్ల నుంచి 45ఏళ్ల లోపు వారికి టీకా వేయడానికి సరిపడా వ్యాక్సిన్ నిల్వలు లేవు. ఇప్పటికే పలురాష్ట్రాలు టీకా ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబై అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిన్‌లో నమోదు చేసుకున్న 18ఏళ్లకు పైబడి 45 ఏళ్ల లోపు వయసున్న ముంబైకర్‌లు ప్రైవేటు హాస్పిటల్ టీకా కేంద్రాల్లోనే వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. ముంబైలో ఈ వయస్సున్న పౌరులు సుమారు 90 లక్షల మంది ఉంటారని, వారందరికోసం 1.80 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ వివరించారు. టీకాల సేకరణ, రవాణా, పంపిణీ, టీకా కేంద్రాల పెంపు లాంటి ప్రధాన సవాళ్లు తమ ముందు ఉన్నాయని, బుధవారం జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుతం 45ఏళ్లు పైబడినవారికి మున్సిపల్, ప్రభుత్వం నిర్వహణలోని కేంద్రాల్లో టీకా వేస్తారని వివరించారు. కాగా, కొవిన్‌లో ఇప్పటికే నమోదు చేసుకున్న 18ఏళ్ల నుంచి 45ఏళ్ల మధ్య గల వయోజనులందరికీ ముంబైలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్ టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

అర్హులెక్కువ.. టీకాలు తక్కువ: రాష్ట్ర ఆరోగ్య మంత్రి

మే 1 నుంచి 18ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారికి టీకా వేయాల్సి ఉన్నదని, రాష్ట్రంలో ఈ వయస్సుగల పౌరులు సుమారు ఐదు కోట్ల మంది ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె వివరించారు. కానీ, టీకాలు సరిపడా స్థాయిలో లేవని తెలిపారు. వీరందరికీ టీకా వేయడానికి 12 కోట్ల డోసులు అవసరమవుతాయని వివరించారు. ఈ విషయమై ఇప్పటికే భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు లేఖ రాశామని చెప్పారు.



Next Story

Most Viewed