చెన్నైలో MI… ముంబయిలో CSK.. ఎందుకిలా..?

by  |
చెన్నైలో MI… ముంబయిలో CSK.. ఎందుకిలా..?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 14వ సీజన్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆయా ఫ్రాంచైజీలు తమ జట్లను సన్నద్దం చేస్తున్నాయి. ఇప్పటికే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేపాక్ స్టేడియంలో చాలా రోజుల నుంచి సాధన చేస్తున్నది. అయితే బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏ జట్టు కూడా తమ హోం గ్రౌండ్‌లో మ్యాచ్‌లు ఆడే వీల్లేకుండా పోయింది. లెగ్ 1లో చెన్నై, ముంబయి వేదికలుగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. సీఎస్కే తమ మ్యాచ్‌లు ముంబయిలో ఆడనుండటంతో తమ క్యాంప్‌ను చెన్నై నుంచి ముంబయి మార్చడానికి నిర్ణయం తీసుకున్నది. మార్చి 26న సీఎస్కే జట్టు ముంబయి బయలుదేరనున్నట్లు సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు.

ముంబయి క్యాంపులో సురేష్ రైనా జాయిన్ అవుతాడని ఆయన వెల్లడించారు. మరోవైపు అందుబాటులో ఉండే క్రికెటర్లతో ముంబయి ఇండియన్స్ వచ్చే వారం చెన్నై బయలుదేరనున్నది. ప్రస్తుతం ముంబయిలోనే సాధన చేస్తున్న క్రికెటర్లు వచ్చే వారం నుంచి చెన్నైలో ప్రాక్టీస్ చేస్తారని ముంబయి ఇండియన్స్ వర్గాలు తెలియజేశాయి. ముంబయి ఇండియన్స్ జట్టులోని కీలక ఆటగాళ్లు ప్రస్తుతం జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే వాళ్లు జట్టుతో పాటు చేరతారని సమాచారం.



Next Story

Most Viewed