ఐఎస్ఎల్ చాంపియన్ ముంబై సిటీ

by  |
Mumbai City
X

పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2020/21 సీజన్ విన్నర్‌గా ముంబయి సిటీ నిలిచింది. గోవాలోని ఫటోర్డా స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్‌పై తొలిసారి ఫైనల్‌కు చేరిన ముంబయి సిటీ 2-1 తేడాతో అద్భుత విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచీ మోహాన్ బగాన్‌పై ఆధిపత్యం చెలాయించిన ముంబయి.. బంతిని ఎక్కువగా తన ఆధీనంలోనే ఉంచుకుంది. అయితే, తొలి గోల్ మాత్రం మోహన్ బగాన్ చేసింది. మ్యాచ్ మొదలైన 18వ నిమిషంలో మోహన్ బగాన్ స్ట్రైకర్ డేవిడ్ విలియమ్స్ క్రిష్ణ అందించిన పాస్‌ను చక్కని గోల్‌గా మలిచాడు. దీంతో మోహన్ బగాన్ జట్టు 1-0 ఆధిక్యంతో నిలిచింది.

ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన మోహన్ బగాన్‌కు అనుకోని ఎదురుదెబ్బ తగలింది. అదే జట్టుకు చెందిన డిఫెండర్ జోష్ లూయిస్ ఎస్పినోస ఆరియో 29వ నిమిషంలో ఓన్ గోల్ చేయడంతో ముంబయికి పాయింట్ లభించింది. ఫలితంగా ఇరు జట్ల స్కోరు 1-1తో సమంగా మారింది. ఇక రెండో అర్ధభాగంలో రెండు జట్లూ గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కానీ, ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. ఇక మ్యాచ్ ముగుస్తుందనగా, 90వ నిమిషంలో ముంబై సిటీ మిడ్ ఫీల్డర్ బిపిన్ సింగ్.. ఒగ్బెచ్ అందించిన పాస్‌ను అద్భుతమైన గోల్‌గా మలిచాడు. ఫలితంగా ముంబై సిటీ 2-1 తేడాతో మోహన్ బగాన్‌పై విజయం సాధించి, ఐఎస్ఎల్-2020/2021 చాంపియన్‌గా నిలిచింది. హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు మ్యాచ్ విన్నర్ బిపిన్ సింగ్‌కు దక్కగా, డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు ఒగ్బెచ్‌ అందుకున్నాడు.


Next Story