వాస్తవాలు మాట్లాడితే ఉలికిపాటు ఎందుకు?

by  |
వాస్తవాలు మాట్లాడితే ఉలికిపాటు ఎందుకు?
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం, ములుగు: మావోయిస్టు కార్యక‌లాపాల‌పై డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి నిజాలు మాట్లాడితే ఉలిక్కి పాటేందుక‌ని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం ఎస్పీ సునీల్‌ద‌త్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ అన్నారు. ఇటీవల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. మావోయిస్టుల అసాంఘిక కార్యకలాపాలపై డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడిన విషయాలపై మావోయిస్టులు ఉలిక్కి ప‌డ్డార‌ని ఎస్పీలు పేర్కొన్నారు. రెండు జిల్లాల ఎస్పీలు వేర్వేరుగా ప్రెస్ మీట్ పెట్టి మావోయిస్టులు మహేష్ అనే వ్యక్తి పేరిట ఈనెల 20 న ఒక కరపత్రాన్ని విడుదల చేయడాన్ని ఖండించారు. కరపత్రాన్ని విడుదల చేసిన మహేష్ అనే వ్యక్తి ఎవరు?, అతని హోదా ఏమిటో కూడా ఎవరికీ తెలియద‌ని వారు ఎద్దేవా చేశారు. మావోయిస్టు అగ్ర నాయకత్వం వ్యాపారుల‌ను, ధనవంతులను బెదిరించి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంద‌ని ఎస్పీలు విమర్శించారు. మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల పేరుతో అమాయకపు గిరిజనులను కాల్చి చంపడం నిజం కాదా ప్రశ్నించారు. మావోయిస్టు ఉద్య‌మంలో ప‌నిచేస్తున్న వారు ఇప్పటికైనా కళ్లు తెరిచి జన జీవన స్రవంతిలో కలవాల‌ని పిలుపునిచ్చారు.

Next Story