రేవంత్‌పై కొండంత అభిమానాన్ని చాటుకున్న MLA సీతక్క

by  |
Revanth Reddy, MLA Seethakka
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీసులో ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క ముందుగా మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వంద వాహనాలతో భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కాన్వాయ్‌గా వచ్చి రేవంత్‌ను కలిశారు. తన సోదరుడు రేవంత్ రెడ్డి ప్రజల కోరిక మేరకు పీసీసీ చీఫ్‌గా నియామకం అయ్యారని, ఈ సందర్భంగా మేడారంలో తాను మొక్కులు చెల్లించుకున్నానని సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా గజమాలతో రేవంత్ రెడ్డి సన్మానించారు. అనంతరం ఈ సదర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కార్యకర్తల అభీష్టం మేరకే అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీగా నియమించిందన్నారు. సీల్డ్ కవర్ అని విమర్శిస్తున్న వారివి ఒట్టి మాటలే అని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరంలేదని సీతక్క కొట్టిపారేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని అన్నారు.

MLA-Seethakka

కార్యకర్తలు, ప్రజలు, భగవంతుని ఆశీస్సులే రేవంత్ రెడ్డిని పీసీసీ వరించేట్లుగా చేశాయన్నారు. పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియామకంతో పార్టీ క్యాడర్‌లో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. వేల సంఖ్యలో అభిమానులను చూస్తుంటే నిజంగా పండగ వాతావరణంలా అనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పటిష్టం కాబోతుందన్నారు. క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డికి భారీ ప్రణాళిక ఉందని ఆమె చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని సీతక్క విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతారని, పార్టీని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడమే రేవంత్ రెడ్డి ముందున్న లక్ష్యం అని సీతక్క తెలిపారు. సీతక్కతో పాటు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రామచంద్ర నాయక్, విజయ రమణ రావు తదితరులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.



Next Story