ఎర్రగడ్డలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

by  |
ఎర్రగడ్డలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదారబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడుతామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆసుపత్రితో పాటు నూతనంగా ప్రభలే పలు రకాల వ్యాధులను గుర్తించేందుకు అత్యాధునిక మెడికల్ రీసర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. మెడికల్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన కరోనా వంటి నూతన వైరస్‎లు ప్రభలితే వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని మంగళవారం ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, డీఎంఈ సంబంధిత అధికారులతో కలిసి చెస్ట్ హాస్పిటల్‌ను సందర్శించి సీఎం కేసిఆర్‌కు సమగ్ర నివేదికను అందజేస్తామన్నారు.

ఈ నేపథ్యంలోనే చెస్ట్ హాస్పిటల్‌ విస్తీర్ణం, నిర్మాణాలు తదితర అంశాలను సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్‌తో చర్చించామని తెలిపారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 18 ఎకరాల విస్తీర్ణంలో చెస్ట్ హాస్పిటల్ నిర్మాణాలు ఉన్నాయని ఇంకా సుమారు 44 ఎకరాల భూమి అందుబాటులో ఉంటుందని తెలిపారు, ఇందులో అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేద ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో నగరంలో ఎప్పుడు రోగులతో రద్దీగా ఉండే గాంధీ, నిమ్స్, ఉస్మానియా వంటి ప్రధాన హాస్పిటల్స్‌పై ఒత్తిడిని తగ్గించవచ్చని వివరించారు.

కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల ప్రజలకు అతి చేరువలో మెరుగైన వైద్యసేవలు అందించవచ్చన్నారు. పేదప్రజలకు సైతం కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనేది సీఎం కేసిఆర్ లక్ష్యమని తలసాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటు పై ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుందని వివరించారు. ప్రభుత్వ వైద్య సేవలను విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఇటీవల సీఎం కేసిఆర్ నూతనంగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో గాంధీ తరహా ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారు. ఇటీవల చెస్ట్ హాస్పిటల్ సందర్శించి అక్కడి పరిసరాలను పరిశీలించిన తానూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రాధాన్యత ను సీఎం కేసిఆర్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు.

Next Story