ఉస్మానియా స్థలంలో మల్టీ స్పెషాలిటీ నిర్మించాలి

by  |
Osmania Hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తామని చెబుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఉస్మానియా ఆసుపత్రి పేరు లేదని.. ఉస్మానియా మల్టీ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణానికి వెయ్యి కోట్లు మంజూరు చేసి కొత్త ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

గతేడాది జూలైలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించి అక్కడ రోగులకు ఇబ్బందులు, సౌకర్యాలు, కొత్త భవన నిర్మాణాలకు సంబంధించి పరిశీలించామని, అయితే అప్పుడు ప్రభుత్వం తమపై క్రిమినల్ కేసులు పెట్టిందన్నారు. అదే ప్రాంతంలో పాత భవనాలు కాపాడుతూ హెరిటేజ్ భవనాలకు ఇబ్బంది కాకుండా పక్కన ఉన్న ఏడెకరాల ఖాళీ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు.

ఇటీవల సీఎం కేసీఆర్ మూడు సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను నిర్మిస్తామని చెప్పారని కానీ, అందులో ఉస్మానియా ఆసుపత్రి లేకపోవడం విచారకరమన్నారు. వెంటనే కనీసం వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో మల్టీ స్పెషలిటీ ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ఆసుపత్రి అని, పేదలకు మంచి వైద్యం అందుతుందన్నారు. ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషలిటీ గా నిర్మాణం చేసి ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తే పేదలకు చాలా ఉపయోగం అన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.


Next Story

Most Viewed