బీజేపీకీ షాక్ ఇవ్వనున్న సీనియర్ నేత.. తిరిగి సొంతగూటికే చేరేనా?

by  |
mukul roy
X

కోల్‌కతా: తృణమూల్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఒకప్పటి సన్నిహిత అనుచరుడు, సీనియర్ నేత ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. 2017లో బీజేపీలోకి చేరిన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీ నేతలను కమలం పార్టీలోకి చేర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. కానీ, కొంతకాలంగా ఆయన బీజేపీ వ్యవహారాల్లో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇటీవలే కోల్‌కత్తాలో బీజేపీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి డుమ్మా కొట్టడంతో ఆయన తిరిగి టీఎంసీలో చేరబోతున్నాడన్న అంశం తీవ్రచర్చనీయాశం అయింది. ముకుల్ రాయ్ సతీమణి అనారోగ్యంతో ఓ హాస్పిటల్‌లో చేరినప్పుడు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్వయంగా వెళ్లి పరామర్శించడంతో బీజేపీ అప్రమత్తమైందని తెలిసింది.

అనంతరం ప్రధాని మోడీ ముకుల్ రాయ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో దీదీపై గెలుపొందిన సువేందు అధికారికి బీజేపీ అధిక ప్రాముఖ్యతనివ్వడంతో ముకుల్ రాయ్, అధికారిల మధ్య గ్యాబ్ పెరిగినట్టు సమాచారం. వీటన్నింటికితోడు టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ తాజా కామెంట్ ముకుల్ రాయ్ తిరిగి రాకపై బలాన్నిస్తున్నాయి. బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తిరిగి రావడానికి యోచిస్తున్నారని, అభిషేక్ బెనర్జీతో చాలా మంది టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు. తిరిగి వచ్చే వారినీ రెండు రకాలుగా విభజించాలని, బీజేపీలోకి చేరినతర్వాత దీదీపై విరుచుకుపడ్డవారిగా, తటస్థంగా ఉన్నవారిగా విభజించి ట్రీట్ చేయాలని అభిప్రాయపడ్డారు.

నేతలను కోల్పోకుండా బీజేపీ గట్టి కసరత్తే చేస్తున్నది. సువేందు అధికారి సహా కొత్తగా చేరినవారిని ఒక్కొక్కరిగా ఢిల్లీకి పలిచి అధిష్టానం చర్చలు జరుపుతున్నది. అయినప్పటికీ బెంగాల్ మాజీ మంత్రి రాజీబ్ బెనర్జీ, సుబ్రాగ్‌షు రాయ్, సోవన్ చటర్జీ, సోనాలి గుహా, దిబేందు బిస్వాస్‌లూ టీఎంసీలో చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Next Story