రుణరహిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్!

by  |
రుణరహిత కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్!
X

ముంబయి: దేశీయ దిగ్గజ కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రుణరహిత సంస్థగా మారినట్టు శుక్రవారం ఆ కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించారు. భారీగా పెట్టుబడుల సమీకరణ, 30ఏండ్ల తర్వాత రైట్స్ ఇష్యూ ప్రకటన, పెట్రో-రిటైల్ జాయింట్ వెంచర్‌లో భాగంగా బ్రిటిష్ పెట్రోలియం కంపెనీకి వాటా అమ్మకాలతో రూ.1.75లక్షల కోట్లు సమీకరించామని ఆర్‌ఐఎల్ తెలిపింది. నిధుల సమీకరణతో రిలయన్స్ రుణరహిత సంస్థగా మారినట్టు ముఖేశ్ అంబానీ చెప్పారు.

గడిచిన రెండు నెలల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 1,68,818కోట్లను సేకరించిందని, ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి రూ.1,15,693.95కోట్లు, రైట్స్ ఇష్యూల ద్వారా రూ.53,124.20కోట్లు వచ్చినట్టు తెలిపారు. వాస్తవానికి 2021, మార్చి నాటికి రుణరహిత సంస్థగా మారే లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, చాలా ముందుగానే లక్ష్యాన్ని అధిగమించింది. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ ‘వచ్చే ఏడాది మార్చి నాటికి రిలయన్స్‌ను రుణరహిత కంపెనీగా మారుస్తామని షేర్ హోల్డర్లకు హామీ ఇచ్చాం. గడువు కంటే చాలా ముందే హామీ నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది. రిలయన్స్ సంస్థ తొలి నుంచీ స్టేక్ హోల్డర్లు, షేర్ హోల్డర్ల అంచనాలను అధిగమించి ముందుకెళ్లే స్వభావాన్ని కలిగి ఉంది. సంస్థ వ్యవస్థాపకులు ధీరుభాయ్ అంబానీ ఆశయాలను, దేశ శ్రేయస్సు, సమగ్రమైన అభివృద్ధికి లక్ష్యాలను నిర్దేశించడమే కాకుండా, వాటిని సాధించే భరోసాను కలిగి ఉన్నాం’ అని చెప్పారు. రిలయన్స్ సంస్థ 9 వారాల్లో 11 ఒప్పందాలతో రూ.1.15 క్షల కోట్లను సేకరించడం ద్వారా జియోలో 24.7శాతం వాటాలను విక్రయించింది.



Next Story

Most Viewed