వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి : మందకృష్ణ

by  |
వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి : మందకృష్ణ
X

దిశ, అచ్చంపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ గృహంపై దాడిని దేశంలోని కోట్లాది మంది ప్రజలు, దళిత బహుజనులపై దాడిగా ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ అభివర్ణించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామ సమీపంలోని గిరిజన భవనం వద్ద సోమవారం మహేష్ అధ్యక్షతన నిరసన సభ నిర్వహించారు దీనికి మంద కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక పక్క కరోనాతో ప్రజలు యుద్ధం చేస్తున్నారని గుర్తుచేశారు.

దేశంలో రోజువారీగా కరోనా బారిన పడి 50వేల మంది ప్రజలు మరణిస్తున్న సందర్భం ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయా రాష్ట్ర ముఖ్య మంత్రులు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం, మాస్కులు ధరించాలని సూచించడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఇంటి పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ గృహం కేవలం ఆయనకు సంబంధించింది కాదని, దేశంలోని కోట్లాది ప్రజల, దళిత బహుజనుల ఆలయంగా భావిస్తారని తెలిపారు. అంబేద్కర్ గృహంపై దాడి జరిగి 20 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు దళితుల పక్షాన ఉద్యమాలు చేశాం, రిజర్వేషన్లు అనుభవిస్తున్నాం, అని చెప్పుకుంటున్న నేతలు, నాయకులు దీనిపై మాట్లాడకపోవడం దారుణమన్నారు.

ఈ నెల 7న రాజగృహంపై దాడి జరిగిందని..నాటి నుంచి దేశంలో ఎక్కడి నుంచైనా ఒక్క నిరసన లేక ప్రకటన వస్తుందని భావించినప్పటికీ, ఏ ఒక్క నేత మాట్లాడక పోవడం శోచనీయమన్నారు. ఈ నెల 10 నుంచి నేటి వరకు ఎమ్మార్పీఎస్ పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని గుర్తు చేశారు. ఈనెల 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దోషులను శిక్షించే వరకు నిరసన కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎమ్మార్పీఎస్ మరియు దళిత అంబేద్కర్ సంఘాల నేతలు పవన్, సైదులు, రాజు, వెంకటేష్, శ్రీధర్, కాశీం, విష్ణు, మల్లేష్‌లతో పాటు హాజరయ్యారు.

Next Story

Most Viewed