ఎమ్మార్వో మనసులో ఏదో పెట్టుకున్నాడు.. మహిళా ఎంపీపీ

by  |
MPP-1
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు మండల తహశీల్దార్ చంద్రశేఖర్ ప్రజా కార్యక్రమాలపై ప్రొటో కాల్ పాటించకుండా తనను, తన పదవిని చిన్నచూపు చూస్తున్నారని ఎంపీపీ కారం విజయకుమారి అన్నారు. బుధవారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… స్థానిక తహశీల్దార్ చంద్రశేఖర్ తనని చిన్నచూపు చూస్తున్నారని, ప్రజా కార్యక్రమాలపై ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె ఆరోపించారు. బుధవారం మండలంలో జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదని ఎమ్మార్వోను ప్రశ్నించారు. గత నెల మండల సర్వసభ్య సమావేశం నుంచి మనసులో ఏదో పెట్టుకొని తనని కేర్ చేయడం లేదన్నారు.

మండల సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ భూమి గురించి అడిగితే సమాధానం చెప్పకుండా సమావేశం నుంచి సీరియస్ గా వెళ్ళిపోయారన్నారు. ప్రభుత్వ భూమి గురించి అడిగితే తప్పా అని ప్రశ్నించారు. సర్వసభ్య సమావేశంలో అన్ని డిపార్ట్ మెంట్ల అధికారుల ముందు తనని కించపరిచేలా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తహశీల్దార్ మనసులో ఏదో పెట్టుకొని కక్ష సాధిస్తున్నారని, తహశీల్దార్ కార్యాలయానికి ప్రజల సమస్య గురించి వెళ్లితే కనీసం ఎంపీపీ అన్న గౌరవం కూడా ఇవ్వకుండా కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా ప్రొటో కాల్ పాటించలేదని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులపై తహశీల్దార్ చంద్రశేఖర్ చిన్నచూపు చూస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆమె అన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అనుదీప్ కి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. ఎంపీపీ పదవిని, తనని చిన్నచూపు చూస్తే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలో ప్రజాప్రతినిధులంటే చిన్న చూపు అయ్యిందని, తహశీల్దార్ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.



Next Story

Most Viewed