ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు ఎంపీ ఉత్తమ్ వార్నింగ్

by  |
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు ఎంపీ ఉత్తమ్ వార్నింగ్
X

దిశ, కోదాడ: కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను, తన సతీమణి పద్మావతి అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి తెలిపారు. సోమవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్‌‌ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ఉత్తమ్‌‌, మాజీ మంత్రి దామోదర్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌‌లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఎక్కవయ్యాయన్నారు. అధికార పార్టీ నాయకులు కక్షపూరితంగా తమ కార్యకర్తలపై కేసులు పెడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కాంగ్రెస్‌‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే న్యాయపోరాటం చేసేందుకు తాము సిద్ధమని, తమ సొంత ఖర్చులుతో వారిని విడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌‌పై ఉత్తమ్ మరోసారి విమర్శలు గుప్పించారు. 16 ఏళ్ళకే సైన్యంలో చేరి దేశ సరిహద్దులలో సేవలందించిన తరువాత ప్రజా జీవితంలోనూ మంత్రిగాను పనిచేసిన తనను విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదన్నారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజల ఆశీస్సులతో గెలిచానని, ఈ విషయాన్ని విస్మరించి స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌‌ తనపై అనైతికంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యేగా ఆయన గెలవడం ఇదే మొదటిసారి, ఇదే చివరిసారన్నారు. నియోజకవర్గంలో కమీషన్ల రాజ్యం నడుస్తుందనన్నారు. రియల్‌ ‌ఎస్టేట్‌‌ నుంచి మద్యం సిండికేట్‌‌ వరకు ప్రతీ వ్యాపారంలో ఎమ్మెల్యేకు వాటా రావడం లేదా అని ప్రశ్నించారు. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీస్‌ ‌అధికారులతో తమ కార్యకర్తలపై బెదిరింపులకు పాల్పడుతూ.. వారిని పార్టీ మారాలని ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, వారి వెంట తాము ఉన్నామని భరోసా కల్పించారు. రానున్న ఎన్నికలలో కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్ధిని 50 వేల మెజారిటీ గెలిపించుకుంటామన్నారు.



Next Story

Most Viewed