తెలంగాణ కేసీఆర్ కుటుంబ జాగీర్ కాదు

by  |
తెలంగాణ కేసీఆర్ కుటుంబ జాగీర్ కాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణ ప్రజల స్వాభిమానం, భవిష్యత్తు, ఆత్మగౌరవానికి సంబంధించినవని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య ప్రకటించారు. మంగళవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అమర వీరులను స్మరించుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తేజస్వి సూర్య మాట్లాడుతూ… ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రమని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ జాగీర్ కాదని.. ఇక్కడి ప్రజలది, యువతదని కుండబద్ధలు కొట్టారు. బంగారు తెలంగాణ అంటోన్న కేసీఆర్ కేవలం టీఆర్ఎస్ పార్టీని మాత్రమే బంగారుమయం చేశారని ఎద్దేవా చేశారు. గులాబీ పార్టీ నేతలకే బంగారం దక్కిందని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ యువతకు ఏమీ ఇవ్వలేదని చెప్పారు.

కేసీరావు.. కేటీరావు.. హరీష్ రావు.. ప్రజలకు ఏమీ రావు..

కేసీఆర్ తెలంగాణను అవినీతిమయంగా మార్చారని విమర్శించారు. ప్రజలకు దక్కింది ఏమీ లేదంటూనే.. ‘‘ఇక్కడ జరుగుతోంది ఒక్కటే.. కేసీరావు… కేటీరావు..హరీష్ రావు.. కవితా రావు ప్రజలకు ఏమీరావు..’’ అని తేజస్వి సూర్యచురకలంటించారు. తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు ఓయూకు వచ్చిన తనను అడ్డుకోవాలని టీఆర్ఎస్ సర్కార్ చూసిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంటే కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మోదీ జనాకర్షణకు టీఆర్ఎస్ వాళ్లు వణికిపోతున్నారన్నారు. మోదీ నాయకత్వంలో బీజేపీ కొత్త హైదరాబాద్, సరికొత్త తెలంగాణను నిర్మిస్తుందని తేజస్వి సూర్య తెలిపారు.

అడ్డుకునే ప్రయత్నం

ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఎంపీ తేజస్వీ సూర్యను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఎన్సీసీ గేట్ వద్ద బ్యారికేడ్లను అడ్డు పెట్టారు. బీజేవైఎం కార్యకర్తలు బ్యారికేడ్లను చేధించుకుని, గేట్లు దూకి లోపలికి వెళ్లారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed