సచివాలయం జీ బ్లాక్‌ కింద గుప్తనిధులున్నాయి: రేవంత్

by  |
సచివాలయం జీ బ్లాక్‌ కింద గుప్తనిధులున్నాయి: రేవంత్
X

దిశ, న్యూస్‌బ్యూరో: మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం జీ బ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నాయని మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో ప్రతికలు ప్రచురించాయని, నిజాం నిధులు నేలమాలిగల్లో దాచుకున్నారని నివేదికలు కూడా ఉన్నాయని ఉటంకించారు. మింట్ కాంపౌండ్, విద్యారణ్య స్కూల్ ఆవరణ, హోమ్ సైన్స్ కాలేజీలో గతంలో సొరంగాలు బయట పడ్డాయని, ఆ సొరంగాల కేంద్రం జీ బ్లాక్ కిందకు ఉన్నాయని అప్పట్లో పురావస్తుశాఖ గుర్తించిందన్నారు. అక్కడ అన్వేషణకు పురావస్తుశాఖ జీహెచ్ఎంసీకి లేఖ రాస్తే అనుమతి ఇవ్వకుండా.. లేఖ రాసిన అధికారిని పదవి నుంచి తొలగించారని రేవంత్‌ గుర్తుచేశారు. అయితే మంచి కార్యక్రమాలు ఎప్పుడైన పగటిపూట చేస్తారని, కానీ గుప్తనిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చెస్తారని, అసలు పురావస్తుశాఖ పర్యవేక్షణలో ఎందుకు తవ్వకాలు జరపడం లేదని ప్రశ్నించారు.

పొక్రాన్ అణు పరీక్షలూ ఇంత రహస్యంగా జరపలేదని, సచివాలయం కూల్చివేతకు ముందు జీ బ్లాక్ కింద ఎన్ఎండీసీ, పురావస్తుశాఖతో పరిశోధన జరపాలని రేవంత్ డిమాండ్ చేశారు. జీ బ్లాక్ కింద గుప్తనిధులు ఉన్నట్లు కేసీఆర్ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో కూడా వార్తలు వచ్చాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా స్వీకరించి కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 29న సచివాలయాన్ని కూల్చొద్దని తాము కోర్టుకు వెళ్తే, సచివాలయం కూల్చడానికి అభ్యంతరం లేదంటూ హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. తాము కోర్టును ఆశ్రయించినప్పటి నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, జులై 10న కూల్చివేతపై కోర్టు స్టే ఇచ్చిన మరుసటి రోజే బయటకు వచ్చారని చెప్పుకొచ్చారు. ఈ 11రోజులు సీఎం ఎక్కడికి పోయారో చెప్పాలని, తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. సచివాలయం చుట్టూ 3కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారన్నారు. తమకు అనుమానం రావడంతో ఎంక్వైరీ చేస్తే సచివాలయం కూల్చివేతలో నిధి అన్వేషణ జరుగుతుందనే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయన్నారు.



Next Story