కేటీఆర్ భూములపై ఆధారాలిస్తా: ఎంపీ రేవంత్

by  |
కేటీఆర్ భూములపై ఆధారాలిస్తా: ఎంపీ రేవంత్
X

దిశ, న్యూస్‌బ్యూరో: 111జీవో ఉల్లంఘించిన అంశంలో మంత్రి కేటీఆర్ మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24గంటలు గడిచినా టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన భవనం నిర్మించారని, వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చారని, తన భవనానికి విశాలమైన రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌కు వెళ్లామని చెప్పారు. 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందని తెలిపారు. 301, 302 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణికి భూమి ఉందని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇస్తానని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అర్బణా వెంచర్స్‌కు కూడా అక్కడ భూమి ఉందని, అందులో కేటీఆర్‌కు వాటా ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో ఉందని తెలిపారు. ఆ భూములు లీజుకు తీసుకుంటే అఫిడవిట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎవరి దగ్గర లీజుకు తీసుకున్నారో, దాని యజమాని ఎవరో బయట పెట్టాలని, అక్కడ వారి భూములున్నట్లు తాను నిరూపిస్తానని, లేదంటే ఏ శిక్షకైనా సిద్ధమని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

కేటీఆర్‌పై చర్య తీసుకోవాలి: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మంత్రి కేటీఆర్ భూముల అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేశారని, ఏం నేరం చేశారని రేవంత్‌ రెడ్డిని జైలులో పెట్టి ఇబ్బంది పెట్టారని విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొయినాబాద్, శంకర్‌పల్లి ప్రజలకో న్యాయం… మంత్రి కేటీఆర్‌కో న్యాయమా? అని విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 111 జీవోకు విరుద్ధంగా ఉన్నాయని వేల ఇళ్లను కూల్చారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిర్మాణాన్ని మాత్రం వదిలేశారని మండిపడ్డారు.

Next Story

Most Viewed