వైఎస్సార్‌ పేరును అపహాస్యం చేయొద్దు : సీఎం జగన్‌కు రఘురామ లేఖ

by  |
వైఎస్సార్‌ పేరును అపహాస్యం చేయొద్దు : సీఎం జగన్‌కు రఘురామ లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై మరోసారి లేఖల దాడికి దిగారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. వరుసగా మూడో రోజు మరో లేఖ రాశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వైఎస్సార్ పెళ్లికానుక, షాదీ ముబారక్ హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ శనివారం లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుందని.. ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.50 వేలను లక్షకు పెంచి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు.

ఏ ఒక్క నిరుపేద వర్గం ఇంట్లో కూతురి వివాహానికి అండగా నిలబడలేకపోయారని విమర్శించారు. ఆర్ధిక ఇబ్బందులతో ఎందరో కూతుర్ల పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ పేరు పెట్టి ఆయన పేరు, కీర్తిని అపహాస్యం చేయద్దని కోరారు. తక్షణమే వైఎస్సార్ పెళ్లికానుక బకాయి మంజూరు చేసి హామీ నిలబెట్టుకోవాలని సీఎం జగన్‌ను రఘురామ కోరారు. ఇకపోతే ఇప్పటికే వైఎస్సార్ పెన్షన్ కానుక, సీపీఎస్ రద్దు హామీలు నెరవేర్చలేదని రఘరామ లేఖలు రాసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed