సీఎం రాజీనామా అడుగుతారేమో అని భయం అవుతోంది : ఆర్ఆర్ఆర్

by  |
MP Raghu Ramakrishnam Raju
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్వీ రమణకు కొంతమంది ముళ్ల కంచె వేసినా.. దాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏప్రిల్ 24న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. సీఎం జగన్ అక్టోబర్ 26న చేసిన అభియోగాలు నిరాధారం, దురుద్దేశంతో న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలుగా ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బాబ్డే తోసిపుచ్చారు. హైకోర్టు సింగిల్ జడ్జి బెంచి నిమ్మగడ్డకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేస్తామన్న వైసీపీ మంత్రులకు సుప్రీంకోర్టులో తీర్పు అనంతరం సీఎం రాజీనామా అడుగుతారేమో అన్న భయం కలుగుతోంది. నేను సీబీఐ విచారణ నుంచి తప్పుకుంటున్నానని మా పార్టీ నేతలు మాట్లాడుతున్నారు.

సీబీఐ ప్రధాన కార్యాలయం ఉన్నది ఢిల్లీలో ఉందన్న విషయం గమనించాలి. ప్రతి శుక్రవారం ఏదో కార్యక్రమం పెట్టుకుని సీబీఐ విచారణకు వెళ్లకుండా ఉంటున్న మా ముఖ్యమంత్రిని, మా ఎంపీలే పరోక్షంగా నా పేరుమీద ఆయనను విమర్శించడం భాధకలిగిస్తోంది. రాష్టంలో 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా… కేవలం 2 కోట్ల డిమాండ్ చూపించి, మిగతా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రైవేటుగా అమ్మకునే విదంగా పని చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి నుంచి ప్రాజెక్ట్ (గంగవరం పోర్టు) ను గుజరాత్ కంపెనీకి అమ్ముకుంటే భాదగా ఉంది. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. ఇప్పుడు ఎవరు మెడలు వంచారో అని ప్రజలకు తెలుసు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకొస్తారు? ఆదానీ, అంబానీలకు రాష్ట్రాన్ని అప్పగిస్తారేమో అన్న అనుమానం కలుగుతోంది.’’ అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed