‘ఆ జీవోతో దక్షిణ తెలంగాణ ఏడారే’

by  |
‘ఆ జీవోతో దక్షిణ తెలంగాణ ఏడారే’
X

దిశ, నల్లగొండ: ఏపీ ప్రభుత్వం తక్షణమే జీఓ 203ను రద్దు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అనితారామచంద్రన్‌కు మెడికల్, పీపీఈ కిట్లను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను ఎడారి చేసే జీఓను రద్దు చేయాలన్నారు. తెలంగాణ నీళ్ల వాటాను అక్రమంగా ఆంధ్ర తరలించడానికి రూ.7వేల కోట్ల నిధులు విడుదల చేసినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడకపోవడం బాధకరమని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నేడు అవేమీ లేవన్నారు. కేసీఆర్ చేతకాని తనంతో మళ్లీ రెండు ప్రాంతాల్లో విద్వేషాలు, కొట్లాటలు జరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని ఘాటుగా విమర్శించారు. పోతిరెడ్డిపాడు నిర్మాణం జరిగితే సీఎం కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చూస్తున్నాడని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తయినా దాంతో పాటే ప్రారంభమైన బ్రహ్మణవెల్లెంల, డిండి, పాలమూరు, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల పనులను 9 శాతం పూర్తి చేయకపోవడం కేసీఆర్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. త్వరలోనే ప్రధానమంత్రి, జలవనరుల శాఖ మంత్రిని కలిసి పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణకు జరగబోయే అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు.

Next Story

Most Viewed