Breaking: వరి దీక్ష ముగింపులో ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ నగరంలోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రెండ్రోజుల వరి దీక్ష కార్యక్రమం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు దీక్షలో పాల్గొన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గతంగా చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నా అన్నింటినీ వదిలేస్తున్నామని ప్రకటించారు. పార్టీలో అందరూ పీసీసీలమే.. అందరం పెద్ద నాయకులమే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం ఎక్కడి వరకైనా పోరాటానికి సిద్ధం అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య, నిరంకుశ విధానాలను ఎండగట్టడానికి ఎప్పుడూ వెనకాడబోమని తెలిపారు. అనంతరం జానారెడ్డి మాట్లాడుతూ… అభిప్రాయ భేధాలు పక్కనబెట్టి నాయకులు ఏకమవ్వడం సంతోషంగా ఉందన్నారు. సమస్యలపై కలిసి పనిచేయడాన్ని కార్యకర్తలు స్వాగతిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సభ నుంచి జానారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి హెచ్చరిక చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించండి.. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రైతు సమస్యలు పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. త్వరలోనే మీ రెండు ప్రభుత్వాలను ప్రజలు పక్కకు నెట్టి దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు భావించేలా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర రైతాంగాన్ని పక్కదారి పట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తెలిపారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇది ప్రకృతి వైపరీత్యం కాదని, ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్షమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లాల్లో ధాన్యం కుప్పల వద్ద రైతులు నెల రోజుల నుంచి కాపు కాస్తున్నారు. వరి ధాన్యం సమస్యను సృష్టించిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వర్షాకాలం ధాన్యం కొనలేమని కేంద్రం చెప్పలేదని స్పష్టం చేశారు.



Next Story