తెలంగాణ చాలా అభివృద్ధి చెందాలి.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, యాదగిరిగుట్ట: గాంధీజీ కలలు కన్న సమాజం రావాలంటే.. యువత గాంధీ ఇచ్చిన స్ఫూర్తి మార్గంలో నడవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం గాంధీ జయంతి కార్యక్రమాన్ని యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ కోమటిరెడ్డితో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. గాంధీని స్మరించుకుంటూ ఎమ్మెల్యే సునీతారెడ్డి పాట పాడి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ ప్రపంచానికే స్ఫూర్తి ప్రధాత అని కొనియాడారు. ఆయన సూచించిన అహింసా మార్గంలో పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నామని అన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికి పార్టీలకతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ఇంకా తొలి దశలోనే ఉందని, ఇంకా చాలా అభివృద్ధి చేయాలని, నా వంతుగా నా పార్లమెంట్ పరిధి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై వంగపల్లి నుండి మోటకొండూర్ మండలం వరకు అండర్ పాస్ బ్రిడ్జికి రూ.56 కోట్లతో పనులు మొదలు పెడతామని అన్నారు. హైదరాబాద్ నుండి ఘట్కేసర్ వరకు ఉన్న MMTS రైలును యాదాద్రి రైల్వే స్టేషన్(రాయగిరి) వరకు పొడిగించేలా రైల్వే మంత్రిత్వ శాఖతో చర్చించి రాయగిరి వరకు MMTS రైలును వచ్చేలా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, నల్లగొండ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, గాంధీ కాంస్య విగ్రహ దాత కానుగు బాలరాజు గౌడ్, జెడ్పీటీసీ తోటకూర అనురాధ, ఎంపీపీ చీర శ్రీశైలం, గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed