‘దళితబంధు’ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఇవ్వాలి.. కోమ‌టిరెడ్డి డిమాండ్

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, భువనగిరి రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతీ ఒక్కరం కృషి చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్యటించిన కోమటిరెడ్డి స్థానిక బండ‌సోమ‌రం గ్రామంలో రామ‌లింగేశ్వర స్వామి ఆల‌యానికి స్థానిక ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. అలాగే పెంచిక‌లప‌హాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కర‌ణ చేశారు. అనంతరం ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని ర‌చించి ద‌ళిత‌, గిరిజ‌న, బ‌హుజ‌నుల‌కు అండ‌గా నిలిచిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన ఆశయాల కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ‘దళితబంధు’ పథకాన్ని దశలవారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

హుజూరాబాద్ దళితులకే కాకుండా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి దళితులకు కూడా వెంటనే ఇవ్వాలని తెలిపారు. అలాగే నూత‌నంగా మంజూరైన‌ వంగ‌ప‌ల్లి బ్రిడ్జి, అనంతారం అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నులు త్వర‌లోనే ప్రారంభ‌మ‌వుతాయ‌ని వెల్లడించారు. గౌరెల్లి నుంచి భ‌ద్రాచ‌లం వ‌ర‌కు నూత‌నంగా మంజూరైన జాతీయ ర‌హ‌దారి ఎన్‌హెచ్ నెంబర్ 930పీ కోసం రూ.2200 కోట్ల నిధులు కేటాయించిన‌ట్లు తెలిపారు. భువ‌న‌గిరి కోట అభివృద్ధికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని, త్వర‌లోనే రాష్ట్రంలో భువ‌న‌గిరి కోట ప‌ర్యాట‌క కేంద్రంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story