విప‌త్తుకు కార‌ణం ప్రభుత్వ నిర్లక్ష్యమే : ఎంపీ కోమటిరెడ్డి

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, తుంగతుర్తి: ఫ్రంట్ లైన్ వారియ‌ర్లను ఆదుకోవ‌డంలో.. జ‌ర్నలిస్టుల‌ను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం అయిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నూత‌న‌క‌ల్ మండల కేంద్రంలోని ఐఎల్ఆర్ గార్డెన్‌లో ఫ్రంట్ లైన్ వారియ‌ర్లకు, పేద కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ… పేద‌ల‌కు నెల‌కు స‌రిప‌డా నిత్యావ‌స‌ర వ‌స్తువులు అందజేసిన నూత‌నల్ స‌ర్పంచ్ తీగ‌ల క‌రుణ-గిరిధ‌ర్ రెడ్డిలను అభినందించారు. ప్రాణాల‌కు తెగించి క‌రోనాతో యుద్ధం చేస్తోన్న ఫ్రంట్ లైన్ వర్కర్లను టీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా గురించి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరవేస్తోన్న జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా గుర్తించేందుకు ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

దాదాపు 15 రాష్ట్రాలు జ‌ర్నలిస్టుల‌ను క‌రోనా యోధులుగా గుర్తించి, విధి నిర్వహ‌ణ‌లో వారు మ‌ర‌ణిస్తే రూ. 10 ల‌క్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తిన‌ట్లు వ్యవ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. క‌రోనాతో ఇంటిపెద్ద చనిపోయిన కుటుంబాలకు దాతల సాయంతో కాంగ్రెస్ పార్టీ రూ.50 వేల ఆర్థికసాయం చేస్తోందని తెలిపారు. అంతేగాకుండా.. క‌రోనా బాధితులకు అంబులెన్స్, మెడిక‌ల్ కిట్లు వంటి వాటిని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు ముందుచూపు లేకనే ప్రపంచలోనే అత్యధిక మంది ఇండియాలో చనిపోయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా క‌రోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చుతామ‌ని తెలిపి ఇప్పటికీ దాని ఊసే ఎత్తడం లేద‌ని దుయ్యబ‌ట్టారు. భువనగిరి, నల్లొండ పార్లమెంట్ పరిధిలో కరోనా బారినపడి అనాథలైన కుటుంబాల వివరాలు సేకరించి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతీ కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed