మేం స్పందించాక గానీ ఆయన నోరు విప్పలేదు

by  |
మేం స్పందించాక గానీ ఆయన నోరు విప్పలేదు
X

దిశ, నల్లగొండ: పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ సీఎం జగన్‌తో సీఎం కేసీఆర్ కుమ్మక్కయ్యారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. కమీషన్ల కోసమే ఇన్నాళ్లూ కేసీఆర్ మౌనం పాటించారని మండిపడ్డారు. శనివారం ఆయన నల్లగొండలో మాట్లాడుతూ… 80 వేల క్యూసెక్కుల నీటి తరలింపునకు అనుగుణంగా పోతిరెడ్డిపాడును విస్తరిస్తున్నట్లు గత డిసెంబర్ అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ ప్రకటించారని, అప్పుడెందుకు కేసీఆర్ స్పందించలేదని ప్రశ్నించారు. జీవోపై తాము మాట్లాడాక కానీ కేసీఆర్‌ నోరు విప్పలేదని, కృష్ణా రివర్ బోర్డుకు ఇన్నాళ్లు లేఖ ఎందుకు రాయలేదన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్‌పై తమకు నమ్మకం లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని ఇంత వరకు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. డిండి ఎత్తిపోతల పథకంలో 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. దక్షిణ తెలంగాణలో పనికిరాని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు కేసీఆర్‌ను అడిగే ధైర్యం లేదన్నారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకే కేసీఆర్ సీఎంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. గోదావరి, కృష్ణా అనుసంధానం పేరుతో మరోసారి రూ.50 నుంచి 60 వేల కోట్ల కమీషన్ల కోసం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లాక్‌డౌన్ ఎత్తేశాక ఇద్దరు ఎంపీలతో కలిసి మోడీకి ఫిర్యాదు చేస్తానని కోమటి‌రెడ్డి వెల్లడించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల తరువాత కూడా అధికారంలోకి రాదని, ఆశలు వదులుకున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటి‌రెడ్డి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed