కేసీఆర్‌‌కు వెన్నుపోటు పొడిచేది కేటీఆరే.. అర్వింద్ హాట్‌ కామెంట్లు

by  |
mp-arvind
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా చాలా ఆసక్తితో ఎదురు చూసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హుజూరాబాద్ విజయం ప్రజల విజయంగా అభివర్ణించారు. ఈటల గెలుపునకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు, కష్టపడిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఓటమితో కేసీఆర్, టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌కు మంత్రి కేటీఆరే వెన్నుపోటు పొడవబోతున్నారని, ఆ రోజు ఎంతో దూరంలో లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఎన్నికలతో కేసీఆర్ శకం ముగిసిందని, కేసీఆర్ పతనానికి ఈటల గెలుపు నాంది అని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌లో ముసలం ప్రారంభం కాబోతోందన్నారు.

డబ్బుతో గెలవాలనుకున్న కేసీఆర్‌కు హుజూరాబాద్ ప్రజలు చెంపపెట్టు పెట్టారని అర్వింద్​ పేర్కొన్నారు. కేటీఆర్ తన తండ్రిని పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారన్నారు. చిన్న ఎన్నిక అని కేసిఆర్, కేటీఆర్​ భావించారని, అయితే మూడు నెలలుగా ఆర్థికమంత్రిని హుజూరాబాద్‌లో ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. 119 నియోజకవర్గాల్లో దళితబంధు ప్రారంభించేలా త్వరలో బీజేపీ పోరాటం ప్రారంభిస్తామన్నారు. దళిత బంధు అమలు కాకపోతే హుజూరాబాద్ ఫలితాలు తెలంగాణ వ్యాప్తంగా రిపీటవుతాయని హెచ్చరించారు. ఇప్పటికైనా కేసీఆర్ రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఎంపీ అర్వింద్ ​డిమాండ్​ చేశారు. కాంగ్రెస్, బీజేపీకి సహకరిస్తే రేవంత్‌ను ఉంచాలో తొలగించాలో సోనియాగాంధీ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.



Next Story

Most Viewed