విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి : బండి

by  |
విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి : బండి
X

దిశప్రతినిధి, కరీంనగర్ : విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని భావించి సొంత డబ్బులతో విద్యా సంస్థలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. జీవితాంతం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన నిరాడంబర వ్యక్తి, ఈ తరానికి స్ఫూర్తి ప్రధాత అని ఆయన కొనియాడారు. రాజబహద్దూర్ వెంకటరామారెడ్డి జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో శాంతి సామరస్యాన్ని పెంపొందించిన గొప్ప అధికారిగా వెంకటరామారెడ్డి చేసిన కృషి మరవలేనిదని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పించారన్నారు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన చాలామంది రెడ్డి హాస్టల్‌లో ఉండి విద్యను అభ్యసించిన వారేనని చెప్పారు.

సాయుధ పోరాట నాయకుడు రావి నారాయణరెడ్డి నుంచి పూర్వ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు వరకు ఎంతో మంది మహనీయులు రెడ్డి హాస్టల్‌లో ఉండి చదువుకున్నారని ఎంపీ వివరించారు. వెంకటరామారెడ్డి సంపాదించిన ప్రతిపైసా పేదల కోసమే వెచ్చించారన్నారు. సంఘసేవకునిగా, విద్యా దాతగా, కులమతాలకు అతీతంగా విశేషసేవలు అందించిన వెంకటరామారెడ్డి జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మహనీయుడు రాజబహద్దూర్ వెంకటరామారెడ్డి చరిత్రను మరుగున పడేశారని ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed