నమస్తే తెలంగాణ యాజమాన్యంపై ఎంపీ బండి సంజయ్ ఫైర్

by  |

దిశ, కరీంనగర్: విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ బ్రేక్ చేసిందంటూ టీఆర్ఎస్ పార్టీ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో కథనం వెలువడటంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వైద్యులకు పీపీఐ కిట్లు లేవని వార్త రాసిన జర్నలిస్టులపై కేసులు పెడుతామని హెచ్చరించిన సీఎం కేసీఆర్.. తప్పుడు వార్త రాసిన నమస్తే తెలంగాణ జర్నలిస్టుపై కేసు పెడుతారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశమంతా ఒకే తాటిపైకి వచ్చి లాక్ డౌన్‌ను పాటిస్తోందని, ఇలాంటి సమయంలో కేంద్రం లాక్ డౌన్ బ్రేక్ చేసిందంటూ అసత్య ఆరోపణలతో వార్తను ప్రచురించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. తప్పుడు వార్తలతో ప్రజలను అయోమయానికి గురిచేయడం అనైతిక చర్య అని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి అనేక తప్పిదాలు చేసినా తాము రాజకీయాలు చేయకుండా ఓపికతో సలహాలు, సూచనలు చేసి ఊరుకున్నామన్నారు. ప్రభుత్వ అండదండలతో నడిచే పత్రికలో ఇలాంటి వార్తలు వస్తే ప్రజలు రేపు నిజంగా నిబంధనలు బ్రేక్ చేసి రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ‘లాక్ బ్రేక్’ అని హెడ్‌లైన్ పెట్టి వార్త రాసిన ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వానికి వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదారి పాటించేలా వార్తా కథనాలు రాయడం మానుకోవాలని ఆ పత్రికా యాజమాన్యానికి బండి సంజయ్ హితవు పలికారు.

Tags: corona, lockdown, mp bandi sanjay, fires on, namaste telangana, management, paper mislead to people

Next Story