పాతబస్తీలో అందరూ టీకా వేయించుకోవాలి : ఓవైసీ

by  |
MP Asaduddin Owaisi
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: కొవిడ్ టీకా విషయంలో అపోహలు వీడి వెంటనే అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో టీకా వేసుకోని వారు ఇంకా చాలామంది ఉన్నారని, వారంతా వెంటనే టీకా వేయించుకోవాలని సూచించారు. సంతోష్ నగర్ డివిజన్‌కు చెందిన కాలంధర్ నగర్ సామాజిక భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఓవైసీ పాల్గొని మాట్లాడుతూ.. కొవిడ్ టీకా ప్రారంభ కార్యక్రమంలోనే తాను టీకా వేసుకున్నానని గుర్తుచేశారు. తనతోపాటు ఎంఐఎం బాధ్యులు చాలామంది రెండు డోసులు పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. కరోనా ఇంకా అంతం కాలేదని, రోజూ ఎక్కడో ఓచోట కరోనా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. యూరప్, రష్యా, జర్మనీ దేశాల్లో ఇప్పటికీ ఎక్కువగా ఉందని చెప్పారు.

కరోనా మహమ్మారి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మళ్లీ ఇతర దేశాలపై పడుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పాతబస్తీ ప్రజలంతా టీకా వేయించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకా వేసుకోని వారి సమాచారం సేకరిస్తున్నారని, వారికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, జోనల్ కమిషనర్ సామ్రాట్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకట్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed