ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం.. ఆ వాహనాల్లో వ్యర్థాల తరలింపు!

by  |
Private hospital Wastage
X

దిశ, హుజూర్‌నగర్: కరోనా, బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్‌ల పేరుతో మార్కెట్‌లో కొత్తరకం వైరస్‌లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ వైరస్‌ల మూలంగా ఆరోగ్యం విషయంలో ప్రతి అంశాన్ని అందరూ సూక్ష్మ దృష్టితో చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలో ప్రతిఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తుంటే.. కొన్ని ఆసుపత్రులు మాత్రం బయో మెడికల్ వేస్టేజీని ఇన్స్ లేటర్‌కు తరలించకుండా నిబంధనలు గాలికొదిలేశాయని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. దీంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల తీరుపై సర్వత్రా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

మున్సిపల్ డంపింగ్ యార్డుకే బయో వేస్టేజీ..

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో పదుల సంఖ్యలో ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి. రోజువారీగా వందల సంఖ్యలో రోగులకు ట్రీట్‌మెంట్లు, పదుల సంఖ్యలో సర్జరీలు ఆ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని ఆసుపత్రుల నుంచి వచ్చే బయో వేస్టేజీ అంతా మున్సిపాలిటీ చెత్త బండిలోనే డంపింగ్‌యార్డుకు చేరుతోంది. ఆసుపత్రి యాజమాన్యాలు వేస్టేజీ వేరు చేయకుండా.. అలాగే చెత్త బండిలో వేయడంతో ఆ బండి కాలనీల్లో తిరిగినప్పుడు ప్రజలకు ప్రమాదకర రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆసుపత్రి యాజమాన్యాలు, అధికారులు స్పందించి, ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కేటగిరీలుగా డివైడ్ చేయట్లే..

హాస్పిటల్లో ఉపయోగించిన బయో మెడికల్ వేస్టేజీని రెడ్, వైట్, ఎల్లో, బ్లూ కేటగిరీలుగా వేరు చేయాలి. రెడ్ కేటగిరీల్లో సూదిలేని సిరంజీలు, గ్లౌజులు, బాటిల్స్, యూరిన్ బ్యాగులు ఉంటాయి. వైట్ కేటగిరీల్లో నీడిల్స్, సిరంజీలు, బ్లేడ్లు, సర్జరీలకు వాడే పరికరాలుంటాయి. ఎల్లో కేటగిరీల్లో ఇన్ఫెక్షన్ ఉన్న అవయవాలు, రక్తంతో తడిసిన వస్తువులు, బ్యాండేజీలు, కాటన్ క్లాత్‌లు ఉంటాయి. కాగా వ్యర్ధాలను తరలించడానికి కొన్ని ఆసుపత్రులు ఏజెన్సీతో సమన్వయం కాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందికి చెత్త వేరు చేయడంపై అవగాహన ఉండటం లేదని ఆరోపిస్తున్నారు.

ఇన్స్‌లేటర్‌తో సమన్వయం కావట్లే..

మెడికల్ బయో వేస్టేజీని తరలించడానికి పట్టణంలోని అన్ని ఆసుపత్రులు ఓ ఇన్స్ లేటర్‌తో సమన్వయం కావాలి. బెడ్ల సంఖ్య ఆధారంగా సదరు ఏజన్సీ ఛార్జ్ చేసి, స్పెషల్ వెహికల్ ద్వారా వ్యర్ధాలను బయో మెడికల్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు తరలిస్తోంది. అక్కడ 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో వాటిని కాలుస్తారు. కొన్నింటిని పూడుస్తారు. స్థానికంగా కొన్ని ఆసుపత్రులు మాత్రమే రంగారెడ్డి జిల్లాకు చెందిన రోమా బయో మెడికల్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్‌‌తో సమన్వయమైనట్లు సమాచారం. కోవిడ్ సమయంలో ఉపయోగించిన గ్లౌజులు, సిరంజీలు, వాడేసిన పీపీఈ కిట్లను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తగా ప్లాంట్లకు తరలించి దహనం చేయాలి. కానీ, స్థానికంగానే వాటిని డంప్ చేయడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

నోటీసులు పంపించాం : కె.నరేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్పెషల్ ఆటో ద్వారా ఆసుపత్రుల బయో వేస్టేజీని తరలిస్తున్నాం. ఏజన్సీతో సమన్వయం కావాలని గతంలో అన్ని ఆసుపత్రులకు నోటీసులు పంపించాము. మరోసారి నోటీసులు పంపిస్తామని, అయినా.. వినకపోతే సమావేశం ఏర్పాటు చేసి, నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Next Story