‘ఏప్రిల్ 30న సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు దుండగుడి ఫోన్‌కాల్

by Disha Web Desk 9 |
‘ఏప్రిల్ 30న సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు దుండగుడి ఫోన్‌కాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు ఫోన్‌కాల్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ అగంతకుడు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఫోన్‌కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఫోన్ చేసింది ఎవరనేది కనుక్కునేందుకు దర్యాఫ్తు ప్రారంభించారు. అగంతకుడు తన పేరు రాకీభాయ్ అని, జోధ్‌పూర్‌కు చెందిన గోరక్షకుడినని ఫోన్‌లో చెప్పినట్లు సమాచారం. ఇందులో నిజానిజాలను తేల్చడంతో పాటు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు రాజస్థాన్ పోలీసులను సైతం అలర్ట్ చేశారు.

అయితే, ఏకంగా ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి కాల్ చేసి మరీ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం.. చంపి తీరతాం అని చెప్పటం సంచలనంగా మారింది. కాగా, గతంలోనూ సల్మాన్ ఖాన్ ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఈ–మెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కూడా సల్మాన్‌ను చంపేస్తామని హెచ్చరించాడు. 2018లో విచారణ కోసం కోర్టుకు వచ్చిన బిష్ణోయ్.. కోర్టు ఆవరణలోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించిన ధాకడ్ రామ్ సిహాగ్ అనే దుండగుడిని రాజస్థాన్ పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. మరోవైపు, బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడకు వెళ్లాలన్నా ఫుల్ సెక్యూరిటీతోనే వెళుతున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కొత్త బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కొనుగోలు చేశాడు.



Next Story

Most Viewed